నేడు జిల్లాకు ‘గడ్కరీ’ | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు ‘గడ్కరీ’

May 5 2025 8:52 AM | Updated on May 5 2025 8:52 AM

నేడు జిల్లాకు ‘గడ్కరీ’

నేడు జిల్లాకు ‘గడ్కరీ’

రెబ్బెన(ఆసిఫాబాద్‌): మంచిర్యాల జిల్లా నుంచి వాంకిడి వరకు రూ.3500 కోట్లతో చేపట్టిన నాలుగు వరుసల జాతీయ రహదారి ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం జిల్లాకు రానున్నారు. మంచిర్యాల నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు స్టేజ్‌– 1, స్టేజ్‌– 2లో భాగంగా నిర్మించిన ఎన్‌హెచ్‌– 363ను రెబ్బెన మండలంలోని కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద కేంద్ర మంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం, నేషనల్‌ హైవే అఽఽథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. వాసవి జిన్నింగ్‌ మిల్లు వద్ద సభాస్థలితోపాటు కాగజ్‌నగర్‌ జిన్నింగ్‌ మిల్లు సమీపంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. నాగ్‌పూర్‌ నుంచి హెలిక్యాప్టర్‌ ద్వారా కేంద్రం మంత్రి కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి చేరుకుని జాతీయ రహదారిని ప్రారంభించనున్నారు. అనంతరం సభలో ప్రసంగించి తిరిగి చెగూర్‌లోని కన్హాశాంతి వనం సందర్శనకు వెళ్లనున్నారు.

ఏర్పాట్లు పూర్తి

కేంద్రమంత్రి పర్యటన కోసం కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద ఏర్పాట్లు చేశారు. సభకు సుమారు 15 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జపాన్‌ టెక్నాలజీతో కూడిన టెంటుతోపాటు ప్రజలకు భోజన, తాగునీటి వసతులు కల్పించనున్నారు. వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలం సిద్ధం చేశారు. నాలుగు రోజులుగా సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు దగ్గరుండి ఏర్పాట్ల పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, ఏఎస్పీ చిత్తరంజన్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా నిత్యం పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఎస్పీతో పాటు 9 మంది సీఐలు, 28 మంది ఎస్సైలు, సుమారు 300 మంది పోలీస్‌ సిబ్బందిని బందోబస్తు కోసం కేటాయించారు. ఎక్స్‌రోడ్‌ వద్ద ఫ్లై ఓవర్‌కు రంగులు వేసి అందమైన బొమ్మలతో ముస్తాబు చేశారు. కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ సమీపంలోని వాసవి జిన్నింగ్‌ మిల్లు ఆవరణలో ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఏఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి పోలీసు అధికారులు, సిబ్బందికి బందోబస్తు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్‌ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్‌, వీఐపీ పార్కింగ్‌, హెలిప్యాడ్‌, ఇతర ప్రాంతాల వద్ద బందోబస్తు పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సైబర్‌క్రైమ్‌ డీఎస్పీ రమేశ్‌, రెబ్బెన సీఐ బుద్దే స్వామి, స్పెషల్‌ బ్రాంచి సీఐ రాణాప్రతాప్‌, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

హాజరుకానున్న ప్రముఖులు

జాతీయ రహదారి– 363 ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరు అవుతుండగా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌తోపాటు రాష్ట్ర మంత్రులు సీత క్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్సీలు దండె విఠల్‌, అంజిరెడ్డి, మల్క కొమురయ్య, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పా ల్వాయి హరీశ్‌బాబు, వెడ్మ బొజ్జు పటేల్‌, పాయ ల్‌ శంకర్‌, మహేశ్వర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, గడ్డం వినోద్‌, రామారావు పటేల్‌ హాజరు కానున్నారు.

జాతీయ రహదారి– 363ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి

హాజరుకానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు

ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ నగేశ్‌, అధికారులు

షెడ్యూల్‌ ఇది..

ఉదయం 8.45 గంటలకు నాగ్‌పూర్‌లోని ఇంటి నుంచి బయలుదేరి, 8.55గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 9 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌కు బయలుదేరుతారు. 10.15 గంటలకు కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద గల హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 10.30 నుంచి 11.30 గంటల వరకు నేషనల్‌ హైవే 363ను ప్రారంభించి జాతికి అంకితం చేసి, అనంతరం ప్రసంగిస్తారు. ఉదయం 11.45 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి చెగూర్‌లోని కన్హాశాంతి వన సందర్శనకు బయలుదేరుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement