
ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర
● సీఎస్ఐ చర్చి ఆవరణలో మహోత్సవం ● పెద్ద ఎత్తున తరలిరానున్న క్రైస్తవులు ● ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి
లక్సెట్టిపేట: ఏసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయ జాతరను సీఎస్ఐ చర్చి ఆవరణలో ఈ నెల 25, 26న నిర్వహించనున్నారు. ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్దఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేశారు.
1920లో నిర్మాణం..
ఏటా ఏప్రిల్ 25, 26వ తేదీల్లో సీఎస్ఐ చర్చిలో ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో మెదక్ తర్వాత రెండో పెద్దచర్చిగా పేరొందిన లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి జిల్లాలోని చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. లక్సెట్టిపేట పట్టణ సమీపంలో సుమారు 100 ఎకరాలకు పైగా పచ్చటి పొలాలు, టేకు చెట్ల వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో సీఎస్ఐ చర్చిని ఆంగ్లేయులు నిర్మించారు. 1920లో ఇక్కడికి వచ్చిన ఇంగ్లాండ్ దేశస్తుడు రెవ సీజీ అర్లి దొర నిర్మాణం ప్రారంభించాడు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, దగ్గరలోని గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్టల నుంచి రాళ్లు తెప్పించాడు. సమీప బొట్లకుంటలోని నీటిని నిర్మాణానికి ఉపయోగించారు. మహారాష్ట్ర శిల్పకళాకారులు ఆకర్షణీయంగా నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. నిర్మాణం పనులు సాగుతుండగా వేసవి కాలంలో వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురై అర్లి దొర తిరిగి ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1935లో రివ హెచ్ బర్డ్ చర్చి నిర్మాణాన్ని పరిశీలించి పూర్తి చేయించాడు. అనంతరం ఇక్కడకు మిషనరీగా వచ్చిన రెవ ఫాస్పూట్ చర్చిని సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి ప్రారంభించాడు.
ఘనంగా ఏర్పాట్లు..
జాతర ఏర్పాట్లను సీఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు ఫాధర్ డేవిడ్పాల్ పర్యవేక్షిస్తున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటిస్తూ సాయంత్రం ఊత్కూరు చౌరస్తా నుంచి భాజాభజంత్రీలతో పెద్ద ఎత్తున క్రైస్తవులు ర్యాలీగా చర్చి వద్దకు చేరుకుంటారు. 7 గంటలకు సిలువ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తనలు పాడుతారు. 26న ఉదయం నుంచి చర్చిలో ప్రత్యేక కీర్తనలు పాడుతూ పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సిలువ గుట్టపైకి వెళ్లి కొవ్వొత్తులు వెలిగిస్తారు.