ఖమ్మంమయూరిసెంటర్: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పీపుల్స్మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 6న ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామంలో నిర్వహించే సభను జయప్రదం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ కోరారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానుండగా, జిల్లా నుంచి కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాగా, 2023 మార్చి 16న పిప్పిరి గ్రామంలో మొదలైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మంలో ముగిసిందని తెలిపారు. అనంతరం పాదయాత్రకు మూడేళ్లు నిండిన సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి సత్యనారాయణ కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు మహ్మద్ జావేద్, కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజండ్ల సాయికుమార్, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య, మొక్క శేఖర్గౌడ్, డాక్టర్ కాపా మురళీకృష్ణ, చోటాబాబా, మూడుమంతల గంగరాజు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ


