రేపటి నుంచి పంపిణీకి ఏర్పాట్లు
నెలలో ఎప్పుడైనా తీసుకునే అవకాశం
ఖమ్మం సహకారనగర్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సద్ధమైంది. ఏప్రిల్ 1వ తేదీ (బుధవారం) నుంచి పంపిణీ మొదలుకానుండగా.. ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తారు. ఇందుకోసం కావాల్సిన బియ్యంలో కొంత మేర ఇప్పటికే రేషన్ షాప్లకు చేరవేశారు. ఈ నిల్వలు తగ్గే కొద్ది దశల వారీగా సరఫరా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 4.69లక్షల కార్డులు
జిల్లాలోని 21 మండలాల పరిధిలో 748 రేషన్ షాప్లు ఉన్నాయి. వీటి పరిధిలో 4,69,865 కార్డులకు గాను 13,28,400 మంది లబ్ధిదారులు నమోదై ఉన్నారు. వీరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా, నెలకు 84,90,620 కేజీలు, మూడు నెలలకు కలిపి 2,54,71,860 కేజీల బియ్యం అవసరమవుతాయి. ఈమేరకు బియ్యం పంపిణీ సజావుగా సాగేలా జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలతతో కలిసి సమీక్షించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి షాప్లకు రవాణా, లబ్ధిదారులకు పంపిణీపై సూచనలు చేశారు.
30రోజుల పాటు పంపిణీ
గత వర్షాకాలంలో కూడా ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేశారు. అప్పట్లో 1నుంచి 15వ తేదీ వరకే గడువు విధించగా, సర్వర్ సమస్యతో లబ్ధిదారులు గంటల కొద్ది క్యూలో నిలబడాల్సి రావడంతో గడువు పొడిగిస్తూ వెళ్లారు. ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కావొద్దని ఏప్రిల్ నెల మొత్తం పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేశారు.
ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులందరికీ బియ్యం అందేలా నెల మొత్తం షాపులు తెరిచి ఉంచాలని డీలర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే షాపుల్లో నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా బియ్యం సరఫరా చేశాం. డీలర్లు నిబంధనలు పాటించేలా నిరంతరం పర్యవేక్షించనున్నాం.
– చందన్కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి


