కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంవ్యవసాయం: ‘అంతర్జాతీయ జీరో వేస్ట్ డే’ పోస్టర్లను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.. అదనపు కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలుచేయాలని తెలిపారు. ఈసమావేశాల్లో డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, మైనింగ్ ఏడీ ఆర్.సాయినాథ్, డీఎంహెచ్ఓ రామారావు, డీసీఎస్ఓ చందన్కుమార్, పౌర సరఫరాల సంస్థ డీఎం శ్రీలత, డీఏఓ డి.పుల్లయ్య, డీసీఓ గంగాధర్, డీఎంఓ ఎం.ఏ.అలీంతో పాటు కె.శ్రీనివాసరావు, కె.మంగపతిరావు, చావా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం సహకారనగర్: అక్రమాలు జరగకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా చేసేలా ‘మన ఇసుక వాహనం’ యాప్ను తీసుకొచ్చామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన యాప్ను అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించాక మాట్లాడారు. ఇన్నాళ్లు ఇసుక తరలింపునకు కూపన్లు జారీ చేస్తుండగా, ఈ విధానంలో ఎదురవుతున్న అవకతవకలకు అరికట్టేందుకు యాప్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే క్యూ ఆర్ కోడ్ వస్తుందని వెల్లడించారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వచ్చేనెల 2వ తేదీన గ్రామసభలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్లో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించి అన్ని శాఖల అధికారులు పాల్గొని సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించాలని తెలిపారు.
జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అన్ని శాఖల అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే కాక రద్దీ ప్రాంతాల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుంచి జరిగే పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు ఎనిమిది కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు కేంద్రాల్లో ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణపై సూచనలు చేశారు.
యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా ఏర్పాట్లుచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని, తద్వారా రైతులకు సకాలంలో నగదు అందుతుందని తెలిపారు. అలాగే, కేంద్రాల్లో టార్పాలిన్లు, టెంట్లు, తాగునీటి వసతిపై సూచనలు చేశారు.


