‘నమస్తే’తో వారికి గౌరవం
నమోదు, పరిశీలన పూర్తయ్యాక..
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో
పథకం అమలు
వివరాల నమోదులో
మున్సిపాలిటీల వెనుకబాటు
ఖమ్మంమయూరిసెంటర్: పారిశుద్ధ్య రంగంలో పనిచేసే కార్మికులకు భద్రత, గౌరవం కల్పించడంతో పాటు చేతితో శుభ్రం చేసే పనులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నమస్తే’(నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. డ్రెయినేజీలు, సెప్టిక్ ట్యాంకుల శుభ్రత పనులు చేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కార్మికులు అనారోగ్యంతో మరణించొద్దనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలు చేయాల్సిన ఈ పథకంపై కార్మికుల్లో అవగాహన కల్పించడంలో ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అధికారులు వెనుకబడ్డారనే విమర్శలున్నాయి.
పథకాన్ని మార్చి కొత్తగా..
కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘నమస్తే’ను 2022లో ప్రారంభించారు. గతంలో అమలైన ‘మానవ మల స్కావెంజర్ల పునరావాసం కోసం స్వయం ఉపాధి పథకం (ఎస్ఆర్ఎంఎస్)’స్థానంలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. నేషనల్ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని 2023–24 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది.
దృష్టి సారిస్తే మేలు
పీఎఫ్, ఈహెచ్ఎస్ వంటివి లేక, సరైన వేతనాలు అందకుండా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెద్ద సంఖ్యలోనే ఉన్నా.. వారి వివరాల నమోదులో అధికారులు వెనకబడినట్లు తెలుస్తోంది. ఈ పథకంలో కార్మికుడి వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు లాగిన్ ఐడీల ఏర్పాటుకు వీలు కల్పించింది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు లాగిన్ ఐడీలు తీసుకున్నా.. కార్మికుల వివరాలు నమోదు చేయడం లేదని తెలుస్తోంది. కేఎంసీలో 700 మందికి పైగా కార్మికులు ఉంటే 74 మంది ప్రొఫైలింగ్ మాత్రమే పూర్తయింది. మిగతా వారి వివరాలను నమోదు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రయోజనాలు ఇవే..
‘నమస్తే’పథకం ద్వారా కార్మికులకు దక్కే లబ్ధి భద్రతకే పరిమితం కాక ఆర్థిక స్వావలంబనకు మార్గాన్ని సుగమం చేస్తుంది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కలిపి ఆయుష్మాన్ భారత్ – పీఎం జన ఆరోగ్య యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే, వృత్తిపరమైన భద్రత, యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తూ ఆ సమయాన నెలకు రూ.3 వేల స్టైఫండ్ చెల్లిస్తారు. కార్మికులు సొంతంగా పారిశుద్ధ్య వ్యాపారాలు ప్రారంభించేలా వాహనాలు, పరికరాల కొనుగోలుకు రూ.5 లక్షల ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాయితీ లభిస్తుంది. తక్కువ వడ్డీ రేటు (మహిళలకు 5 శాతం, పురుషులకు 6 శాతం)తో ఇచ్చే ఈ రుణం తిరిగి చెల్లించేందుకు ఏడేళ్ల గడువు ఇస్తారు. అలాగే, కార్మికులకు వ్యక్తిగత రక్షణ కిట్లు, బూట్లు, యాప్రాన్లు ఉచితంగా పంపిణీ చేస్తారు.
నిర్ణీత కాల వ్యవధిలోనే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధి కార్మికులకు ఈ పథకంలో చోటు కల్పించేలా రిజిస్ట్రేషన్ చేయాలి. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం కార్పొరేషన్లతో పాటు మధిర, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు, మణు గూరు మున్సిపాలిటీల పరిధిలో మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులను గుర్తించి ప్రొఫైలింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేఎంసీ పరిధిలో 74, మధిర, వైరా ముగ్గురు చొప్పున, సత్తుపల్లిలో ఇద్దరు, కొత్తగూడెంలో 20 మంది, ఇల్లెందులో 10 మంది, మణుగూరులో ఇద్దరి ప్రొఫైల్ను పూర్తి చేసి పథకం అమలు చేస్తున్నారు. అలాగే, మున్సిపాలిటీకి అనుబంధం కాకుండా, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్న ‘వేస్ట్ పిక్కర్ల’ప్రొఫైలింగ్ కొనసాగుతోంది. వీరిలో బయట రాక్ పిక్కర్లు, వెంట్రుకలు ఏరుకునే వాళ్లు, ఓనర్ కమ్ డ్రైవర్లు వంటి వారు ఉన్నారు. ఆన్లైన్ పరిశీలన పూర్తయ్యాక వీరిందరికీ పథకం ప్రయోజనాలు దక్కుతాయి. ప్రొఫైలింగ్ పూర్తయిన ప్రతీ కార్మికుడికి గుర్తింపు కార్డును జారీ చేస్తారు.
పారిశుద్ధ్య కార్మికులకు
ఆరోగ్యం, భద్రత
‘నమస్తే’తో వారికి గౌరవం
‘నమస్తే’తో వారికి గౌరవం


