మెప్మా పీడీ కార్యాలయం పునఃప్రారంభం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మయూరిసెంటర్లో రైల్వే బ్రిడ్జి ప్రక్కన మెప్మా పీడీ కార్యాలయాన్ని గురువారం పీడీ జి.నళిని పద్మావతి ప్రారంభించారు. మరమ్మతుల కారణంగా మూడేళ్ల క్రితం మెప్మా కార్యాలయాన్ని కేఎంసీ భవనంలోకి మార్చారు. ఇటీవల మరమ్మతులు పూర్తవడంతో మెప్మా పీడీ, డీఎంసీ చాంబర్లను మెప్మా భవనానికి మార్చారు. అయితే, టౌన్ లెవల్ ఫెడరేషన్(టీఎల్ఎఫ్) మాత్రం కేఎంసీలోనే కొనసాగుతుందని పీడీ నళిని పద్మావతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ ఎస్.సుజాత, టీఎంసీ జి.సుజాత, ఉద్యోగులు పాల్గొన్నారు.
13న నవోదయ
ప్రవేశపరీక్ష
కూసుమంచి: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని నవోదయ విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 13న పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఎనిమిది చొప్పున, ములుగు జిల్లా వెంకటాపురంలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు పాలేరు నవోదయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,737 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.
సీసీఐ పత్తి కొనుగోళ్లపై ఆరా
ఖమ్మంవ్యవసాయం: పత్తి విక్రయాల్లో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యాన మార్కెటింగ్ శాఖ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ వి.పద్మావతి గురువారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మద్దులపల్లి మార్కెట్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్, జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి కొనుగోళ్లు, ఆన్లైన్లో వివరాల నమోదును ఆమె పరిశీలించారు. అలాగే, పత్తి విక్రయానికి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన డీడీ క్రయవిక్రయాలు సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ.అలీమ్, సీసీఐ బయ్యర్ వరప్రసాద్, మిల్లుల యాజమానులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతుల పరీక్ష
13, 14 తేదీల్లో ఏర్పాటు
పాల్వంచ: విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదోన్నతుల కోసం పాల్వంచలోని జెన్కో ట్రైనింగ్ సెంటర్లో ఈనెల 13, 14 తేదీల్లో (డిపార్ట్మెంట్ అకౌంట్స్ టెస్ట్) పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రాన్స్కో, జెన్కో, డిస్కం సంస్థల్లో పనిచేసే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ (జేఏఓ), ఏఈలు సైతం పదోన్నతులు రావాలంటే ఈ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తుండగా, ప్రస్తుతం పాల్వంచలో ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు.
16 నుంచి క్రికెట్ టోర్నీ
రుద్రంపూర్: ఈనెల 16 నుంచి 18 వరకు కొత్తగూడెంలోని జయశంకర్ మైదానంలో కంపెనీ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఏరియా జీఎం ఎం.శాలేంరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం – కార్పొరేట్, ఇల్లెందు – మణుగూరు, భూపాలపల్లి, రామగుండం రీజియన్, శ్రీరాంపూర్, బెల్లంపెల్లి – మందమర్రి ఏరియాలను కలుపుతూ ఆరు టీమ్లుగా ఏర్పాటు చేశామని వివరించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
మెప్మా పీడీ కార్యాలయం పునఃప్రారంభం


