నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి సూచించారు. ఖమ్మంలోని టపాలగూడెం బస్తీ దవాఖానాను మంగళవారం తనిఖీ చేసిన ఆమె ఓపీ, ఇమ్యూనైజేషన్ రిజిస్టర్లను పరిశీలించాక చికిత్స కోం వచ్చిన వారితో మాట్లాడారు. ఆతర్వాత వైద్యులు, సిబ్బందితో సమావేశమైన డీఎంహెచ్ఓ పనితీరు, ఆన్లైన్లో వివరాల నమోదుపై సూచనలు చేశారు.అనంతరం మల్లెమడుగు ఆమ్ సెంటర్ను సైతం డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు.
ఉపకార వేతనాలకు
దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: మైనార్టీ విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం డిసెంబర్ 31లోగా ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మహమ్మద్ ముజాహిద్ సూచించారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బుద్ధులు, జైనులు, పార్సీలు అర్హులని తెలిపారు. ఈమేరకు www. telanganaepass. cgg. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
1న అండర్–14
ఫుట్బాల్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–14 బాలబాలికల ఫుట్బాల్ జట్లను వచ్చేనెల 1న ఎంపిక చేయనున్నట్లు జిల్లా పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి వై.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలోని సెడార్ వ్యాలీ స్కూల్లో ఎంపిక పోటీలు జరుగుతాయని, వివరాలకు 99896 47696 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
జర్మనీలో ఉద్యోగ
అవకాశాలు
ఖమ్మంరాపర్తినగర్: జర్మనీ దేశంలో ఉద్యోగావకాశాలు ఉన్నందున నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ సూచించారు. ఐటీఐ పూర్తిచేసి 19 – 30 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు ఎలక్ట్రీషియన్లుగా అర్హులని తెలిపారు. తెలంగాణ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్కాం) ద్వారా ఈనెల 30న టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్లో జరిగే ఇంటర్వ్యూకు అన్ని సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
ఎస్బీఐటీ
అధ్యాపకురాలికి డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్బీఐటీ అధ్యాపకురాలు కె.యోజనకు తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. ‘డీప్ లెర్నింగ్ బేస్డ్ అప్రోచ్ ఫర్ క్లాసిఫికేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆఫ్లాల్మిక్ ఇమేజెస్’ అంశంపై డాక్టర్ ఎల్.ధిలైరాని పర్యవేక్షణలో ఆమె సమర్పించిన పరిశోధనా పత్రానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా యోజనను కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ, సెక్రటరీ, కరస్పాండెంట్ జి.ధాత్రి, డైరెక్టర్లు గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, ఏ.వీ.వీ.శివప్రసాద్, జె.రవీంద్రబాబు, ప్రిన్సిపాల్ రాజ్కుమార్ అభినందించారు.
కుటుంబ సభ్యులకు
విద్యార్థిని అప్పగింత
ముదిగొండ: ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయిన విద్యార్థిని ఆచూకీని ముదిగొండ పోలీసులు గుర్తించి కుటుంబీకులకు అప్పగించారు. నేలకొండపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని ముదిగొండ మండలంలోని తన మేనత్త ఇంటికి రాగా, వచ్చి సోమవారం కానరాకుండా పోయిన విషయం విదితమే. ఈమేరకు సీఐ మురళి రెండు బృందాలు ఏర్పాటు చేసి గాలించగా మంగళవారం ఆమె కోదాడ బస్టాండ్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎస్సై హరిత, సిబ్బంది వెళ్లి విద్యార్థినిని తీసుకొచ్చి కుటుంబానికి అప్పగించారు.
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి


