
పనులు కాకపోతే వేతనాల్లో కోత
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఆమె అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలోని 44 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేసి ఎంబీ రికార్డులు సమర్పిస్తే బిల్లులు విడుదలవుతాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని, లేనిపక్షంలో పాఠశాల సిబ్బంది, ఇంజనీరింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. అలాగే, పాఠశాలకు నీటి సరఫరా లేకపోతే భగీరథ పైప్లైన్ నుంచి కనెక్షన్ ఇప్పించాలని తెలిపారు. విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఎంపీడీఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలు, ఏఈలు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సు తాకిందని దంపతుల ఘర్షణ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం–వైరా ప్రధాన రహదారి గోపాలపురం వంతెన సమీపాన ఆర్టీసీ బస్సు తమపైకి దూసుకొచ్చిందంటూ బైక్పై వెళ్తున్న దంపతులు డ్రైవర్, కండక్టర్తో ఘర్షణకు దిగారు. బుధవారం మణుగూరు నుంచి ఖమ్మం వస్తున్న ఖమ్మం డిపో బస్సు గోపాలపురం వంతెన వద్ద తమ ద్విచక్ర వాహనాన్ని తాకిందంటూ దంపతులు బస్సును ఆపారు. ఆపై డ్రైవర్ మధు, కండక్టర్ ఆదిలక్ష్మితో వాగ్వాదానికి దిగి దాడికి యత్నించగా, బస్సులో ప్రయాణికులు సైతం బైక్పై వెళ్తున్న వారిదే తప్పని చెప్పారు. అయినా వినకపోగా బస్సును ఖమ్మం అర్బన్ పోలీస్స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూడా దంపతులు ఆవేశంగా మాట్లాడం, ప్రయాణికులంతా వారినే తప్పుపట్టడంతో సీఐ భానుప్రకాశ్ వారికి సర్దిచెప్పి ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఘటనలో బస్సు గంటకు పైగా నిలిచిపోగా అందులోని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
వివాహిత ఆత్మహత్య
కేసులో రౌడీషీటర్ అరెస్ట్
రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెం గ్రామానికి చెందిన వివాహిత బోడా సుశీల ఆత్మహత్యకు కారణమైన రౌడీషీటర్, అదే గ్రామానికి చెందిన వినయ్ను పోలీసులు అరెస్ట్చేశారు. ఈ మేరకు నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించినట్టు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. సుశీలను వేధించడమే కాక లైంగిక దాడికి యత్నించి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆమె కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.
అసంక్రమిత వ్యాధుల కట్టడిపై దృష్టి
మధిర/బోనకల్/ఎర్రుపాలెం/చింతకాని: అసంక్రమిత వ్యాధుల వ్యాప్తిని అరికట్టేలా వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా క్షయ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వరికుటి సుబ్బారావు సూచించారు. మధిర మండం దెందుకూరు, బోనకల్, ఎర్రుపాలెం మండలం బనగండ్లపాడు పీహెచ్సీలను బుధవారం తనిఖీ చేసిన ఆయన టీబీ తదితర వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు చికిత్సపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆతర్వాత ఉద్యోగుల హాజరు, ఓపీ రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందూనాయక్ కూడా పాల్గొనగా వ్యాక్సిన్ల నిల్వలు, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయాల్సిన ఆవశ్యకతపై సూచనలు చేశారు. అలాగే, చింతకాని పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. వైద్యాధికారులు స్రవంతి, వి.కావ్య, ప్రశాంత్, అశ్విని, అల్తాఫ్తో పాటు ఉద్యోగులు దానయ్య, సందీప్, కాంతమ్మ, వెంకటేశ్వరావు, అమృత్, వీరేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పనులు కాకపోతే వేతనాల్లో కోత