
అంతకంటే ఎక్కువే!
100 సీట్లకు 82 మంది విద్యార్థినులు
గత రెండు బ్యాచ్ల్లోనూ అగ్రభాగాన వారే..
ఉత్తమ వసతులు, బోధన
సగం కాదు..
2023లో కళాశాల ఏర్పాటు
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుసంధానంగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయగా, 2023 అక్టోబర్లో మొదటి సంవత్సరం బోధన ప్రారంభమైంది. మొత్తం 100 సీట్లతో కళాశాల ఏర్పాటు కాగా జాతీయ కోటాలో 15 శాతం, రాష్ట్ర కోటాలో 85 శాతం సీట్లు కేటాయించారు. హైదరాబాద్, వరంగల్ తర్వాత విశాలంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో ఖమ్మం మెడికల్ కళాశాల నిలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రితో పాటు కళాశాల, హాస్టళ్లు కలుపుకుని సుమారు 30 ఎకరాల మేర స్థలం ఉంది. అంతేకాక నగర నడిబొడ్డున కళాశాల ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది లేనందున ఇక్కడ చేర్పించేందుకు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాక హాస్టళ్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, నిరంతరం సెక్యూరిటీ, విశాలమైన తరగతి, ప్రాక్టికల్ గదులు ఉండడంతో నీట్ ర్యాంకర్ల చూపు ఇటు వైపు తిప్పేలా చేస్తోంది.
మూడు బ్యాచ్ల్లోనూ వారే..
ఖమ్మం మెడికల్ కాలేజీకి అవసరమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లను కేటాయించడంతో బోధన సాఫీగా సాగుతోంది. కళాశాలలో ఈ ఏడాది 100 సీట్లలో 82 మంది విద్యార్థినులు ప్రవేశాలు పొందారు. వీరిలో చాలా మంది నిరుపేదలు, రైతు కుటుంబాలు, చిరువ్యాపారుల కుటుంబాల నుంచే వచ్చారు. అలాగే, గత ఏడాది 56 మంది, అంతకు ముందు ఏడాది 71 మంది అమ్మాయిలు చేరి ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తున్నారు. తద్వారా మూడు బ్యాచ్ల్లోనూ అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు.
జిల్లా విద్యార్థినులకు ప్రయోజనం
గతంలో ఎంబీబీఎస్ సీటు సాధించటం కష్టమైన వ్యవహారంగా ఉండేది. కానీ ప్రస్తుతం అమ్మాయిలు చదువులో రాణిస్తూ లక్ష్యం వైపు కదులుతున్నారు. మూడు బ్యాచ్ల్లో చూస్తే 30 మంది జిల్లా విద్యార్థినులు ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు సాధించారు. మెరుగైన ర్యాంకుతో స్థానికంగా సీట్లు సాధిస్తుండడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా జిల్లాలోనే చదివే అవకాశం రావడం.. అనుకున్నట్లుగానే గత రెండేళ్లలో మంచి ఫలితాలు రావడంతో ఈసారి కూడా విద్యార్థినులు ఇటే మొగ్గు చూపారు. అంతేకాక జాతీయ కోటాలో మహారాష్ట్ర, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, కేరళ రాష్ట్రాల విద్యార్థులు 45 మంది చదువుతున్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అమ్మాయిలే అధికం
కళాశాలలో వసతులకు తోడు ఉత్తమ బోధన అందుతోంది. గత రెండు బ్యాచ్ల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతో ర్యాంకర్లు ఇక్కడ చేరుతున్నారు. అందులో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులకు పటిష్టమైన భద్రత ఉండడంతో చదువు సాఫీగా సాగుతోంది.
– డాక్టర్ శంకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్

అంతకంటే ఎక్కువే!