
డీసీఎంను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఎనిమిది మందికి గాయాలు
కొణిజర్ల: ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. భద్రాద్రి జిల్లా మణుగూరు నుండి ఖమ్మం వస్తున్న ఆర్టీసీ బస్సు కొణిజర్ల పోలీస్స్టేషన్ సమీపాన ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న భూక్యా లక్ష్మి, వడ్డె గిరి, వేము వాణి, కొత్తకోట భిక్షపతి, ఉప్పలయ్య, భాస్కర్, దుర్గాభవాని, భూక్యా బిందుకు గాయాలయ్యాయి. వీరిని 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించినట్లు కొణిజర్ల ఎస్ఐ సూరజ్ తెలిపారు.
బస్సు కిందకు
దూసుకెళ్లిన స్కూటీ
నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు స్కూటీ బస్సు కిందకు దూసుకెళ్లగా యువకుడు తృటిలో ప్రాణా పాయం నుంచి బయటపడ్డాడు. మండలంలోని గువ్వలగూడెంకు చెందిన మహేష్ గురువారం స్కూటీపై నేలకొండపల్లి రాగా, పొట్టి శ్రీరాముల సెంటర్లో మలుపు తిరుగుతుండగా కోదాడ నుంచి ఆర్టీసీ బస్సు ఖమ్మం వెళ్తోంది. ప్రమాదవశాత్తు బస్సు కిందకు స్కూటీకి దూసుకెళ్లగా మహేష్ పక్కకు దూకడంతో రెప్పపాటులో ప్రమాదం తప్పినట్లయింది.
వీసాలు ఇప్పిస్తానని మోసం
15 మంది నుంచి రూ.70 లక్షల వసూలు
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలోని నారాయణపురం, రాజుపాలెం గ్రామాల యువకులను విదేశాలకు పంపిస్తానంటూ వీసాల పేరిట నగదు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై గురువారం కేసు నమోదైంది. ఏపీ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన మోట్ల అభినవ్కుమార్ హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటుచేశాడు. ఆయనకు ఎర్రుపాలెం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వేముల సురేష్కు అభినవ్ పరిచయం కాగా.. జార్జియా దేశంలోని హాస్టళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికాడు. దీంతో రూ.4లక్షలు చెల్లించిన సురేష్ ఈ విషయాన్ని తన స్నేహితులు, బంధువులకు చెప్పాడు. ఈమేరకు నారాయణపురం, రాజు పాలెం గ్రామాలకు చెందిన 15మంది యువకులు రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు మొత్తం రూ.70లక్షల వరకు అభినవ్ వసూలు చేశాడు. ఆపై వీసాలు ఇప్పించడంలో జాప్యం చేస్తుండగా అనుమానంతో ఒత్తిడి చేశారు. దీంతో ఆయన ముఖం చాటేయగా మోసపోయామని గ్రహించిన బాధితుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు ఎర్రుపాలెం ఎస్ఐ రమేష్ తెలిపారు.
మతిస్థిమితం లేని వ్యక్తులకు వైద్యసాయం
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్లో మతిస్థిమితం లేని గుర్తుతెలియని వ్యక్తులకు కొన్నాళ్లుగా ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆరుగురికి మెరుగైన వైద్యం అందేలా గురువారం పోలీసుల సమక్షాన ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించినట్లు ఫౌండేషన్ చైర్మ న్ శ్రీనివాసరావు తెలిపారు. ఆతర్వాత కోర్టు అనుమతి తీసుకుని పోలీసు సిబ్బంది సాయంతో వారికి మెరుగైన వైద్యం కోసం ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తరలించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది సుధాకర్ పాల్గొన్నారు.