
నిర్విరామ కృషితోనే సాధ్యం
● వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● ఆయిల్ఫెడ్ ఫ్యాక్టరీ మేనేజర్లు, సిబ్బందికి అభినందన
దమ్మపేట:అప్పారావుపేట, అశ్వారావుపేట పామా యిల్ ఫ్యాక్టరీల మేనేజర్లు, సిబ్బంది నిర్విరామ కృషితోనే మూడు లక్షల టన్నుల పామాయిల్ గెలల క్రషింగ్ సాధ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిర్దేశిత క్రషింగ్ లక్ష్యాన్ని సాధించిన నేపథ్యంలో ఆదివారం మండలంలోని అప్పారావుపేట ఫ్యాక్టరీ ప్రాంగణంలో అధికారులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీల మేనేజర్లు కళ్యాణ్, నాగబాబులతోపాటు సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆయిల్పామ్ సాగులో ఎకరాకు 12 టన్నులు పైబ డి దిగుబడి సాధించిన రైతులు స్వీయ అనుభవా లను వివరించారు. వారినీ సన్మానించారు. మహా రాష్ట్రకు చెందిన రైతు చంద్రశేఖర్ వ్యవసాయంలో అనుసరిస్తున్న రీజనరేటివ్ విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రీజనరేటివ్ విధానాన్ని పరిశీలించేందుకు 40 మంది రైతులను అక్కడికి పంపుతామన్నారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించి, రాబోయే సంవత్సరానికి నూతన ఫ్యాక్టరీ నిర్మించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఆయిల్ఫెడ్ సిబ్బందికి పదోన్నతి కల్పించాలన్నారు. తోటల్లో ఆయిల్పామ్ చెట్లపై నుంచి వెళ్తున్న విద్యుత్తు లైన్లను మార్చాలని విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్ను ఆదేశించారు. అప్పారావుపేట గ్రామ అభివృద్ధి, అశ్వారావుపేట లో డివైడర్ నిర్మాణానికి ఆయిల్ఫెడ్ నిధులు కేటా యిస్తామన్నారు. ములకలపల్లి మండలంలో పది వేల ఎకరాల సాగు విస్తీర్ణం దాటితే ఫ్యాక్టరీ నిర్మిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు.
15 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం..
ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 15 లక్షల ఎకరాల్లో పామాయిల్ మొక్కలను పెంచడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. అత్యధిక ఓఈఆర్ 19.92ను సాధించడంతో రైతులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. భ ద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ రైతులు మునగ, వెదురు, కూరగాయలు సాగు, పట్టు పురుగుల పెంపకంపై కూడా దృష్టి సారించాలని అన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ పేటలో పామాయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ నెలకొల్పాలని, అచ్యుతాపురంలో ఖాళీగా ఉన్న 40 ఎకరాల భూ విస్తీర్ణంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్సు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఆయిల్ఫెడ్ ఓఎస్డీ కిరణ్ కుమార్, డివిజనల్ మేనేజర్ రాధాకృష్ణ, ఫ్యాక్టరీ మేనేజర్లు కళ్యాణ్, నాగబాబు, సొసైటీ చైర్మన్ ఎల్లిన రాఘవరావు, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు రావు గంగాధరరావు, కాసాని నాగప్రసాద్, కె.వి, రైతులు పాల్గొన్నారు.