
గురుకులాల్లో అదనపు కలెక్టర్ తనిఖీ
కొణిజర్ల: అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సోమవారం సాయంత్రం కొణిజర్ల మండలంలోని పలు గురుకులాలను తనిఖీ చేశారు. అమ్మపాలెంలోని మైనార్టీ బాలురు గురుకుల పాఠశాల, జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకులాలను తనిఖీ చేసిన ఆమె వసతి, వంట గదులు, మెస్లను పరిశీలించడమే కాక వంట తయారీకి ఉపయోగిస్తున్న సరుకుల నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థులకు ఉత్తమ బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ప్రిన్సిపాళ్లు బి.నాగమణి, జితేష్ సాహిల్, ఉద్యోగులు సీహెచ్.రంజిత్, నిర్మల, యాకూబ్పాషా, తులసి పాల్గొన్నారు.
కేఎంసీ కమిషనర్..
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య సోమవారం పలు గురుకులాలను తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీయడమే కాక, అవసరమైన సామగ్రి, తాగునీరు, విద్యుత్ సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.
రేషన్ లబ్ధిదారులు
ఈ కేవైసీ చేయించుకోవాలి
ఖమ్మం సహకారనగర్: రేషన్ కార్డుదారులంతా రేషన్ షాపుల్లో ఈ కేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్కుమార్ సూచించారు. జిల్లాలో 4,15,905 కార్డులకు 12,03,943 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. వీరిలో 9,64,236 మంది మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్న నేపథ్యాన మిగతా వారు కూడా ముందుకు రావాలని తెలిపారు. కాగా, హోటళ్లు, హాస్టళ్లలో గృహోపయోగ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని డీసీఎస్ఓ హెచ్చరించారు. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో సోమవారం చేపట్టిన తనిఖీల్లో సిలిండర్లు స్వాధీం చేసుకుని బాధ్యులపై కేసు నమోదు చేశామని తెలిపారు.
నేటితో ముగియనున్న ఎప్సెట్ కౌన్సెలింగ్
ఖమ్మం సహకారనగర్: ఎప్సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు చేపట్టిన కౌన్సెలింగ్ మంగళవారం ముగియనుంది. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాలలో గత వారం రోజులుగా సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. ఈ కౌన్సెలింగ్ మంగళవారం ముగియనుందని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా, కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ చందా సుధాకర్ తెలిపారు. కాగా, సోమవారం 800 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా 760మంది హాజరయ్యారని వెల్లడించారు.
గెజిటెడ్ అధికారులకే
‘స్వగృహ’ ఫ్లాట్లు
ఖమ్మం సహకారనగర్: తొలుత నిర్ణయించినట్లుగా గెజిటెడ్ అధికారులకే మాత్రమే రాజీవ్ స్వగృహ సముదాయంలో ఫ్లాట్లు ఇవ్వనున్నామని టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మంలోని టీజీవోస్ భవన్లో జరిగిన సొసైటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల హౌస్ బిల్డింగ్ సొసైటీలో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు 1,012మంది సభ్యులుగా చేరారని తెలిపారు. ఇందులో పలువురు బ్యాంక్లో నగదు డిపాజిట్ చేశారని చెప్పారు. ఈనెల 10వ తేదీలోపు అందరూ డిపాజిట్ చేయాలని సూచించారు. ఈసమావేశంలో సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా కిషోర్, విజయ్కుమార్, టీజీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రితో పాటు శేషుప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రామయ్యకు
ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తది తర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.