
పేదలకు అండగా ప్రభుత్వం
● అర్హులందరికీ దశల వారీగా ఇళ్లు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్: రాష్ట్రప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తూ పాలన సాగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదులాపురం మున్సి పాలిటీలో సోమవారం పర్యటించిన మంత్రి పలు అభివృధ్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మద్దులపల్లిలో రూ.94లక్షలతో నిర్మించనున్న బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశాక డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. అలాగే, పోలేపల్లి –రాజీవ్గృహకల్ప కాలనీ ఎన్నె స్పీ లాక్ల వరకు రూ.2.86కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, తెల్దారుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజచేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల కోసం గతంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని తెలిపారు. ఇదే సమయాన కొత్తగా ఉచిత విద్యుత్, సన్న ధాన్యానికి బోనస్, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయానం, ఇంది రమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాలు మొదలు పెట్టామని వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ బి.హరినాధ్బాబు, ఆర్డీఓ జి.నర్సింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పి.రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.