
విద్యారంగం అభివృద్ధికి ఏమేం చేయాలి ?
మధిర: ప్రైవేట్కుఏ దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని తీర్చిదిద్దేందుకు ఎలాంటి సంస్కరణలు చేస్తే బాగుంటుందని విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆరా తీశారు. మండలానికి మూడు పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా మధిర నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింఇ. ఈ నేపథ్యాన విధి విధానాలు, సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు మురళి సోమవారం మధిరలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిపురం ఉన్నత పాఠశాలలో చైర్మన్, డీఈఓ ఎస్.సత్యనారాయణను పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆర్.బ్రహ్మారెడ్డి తదితరులు కలిశారు. కొత్త పాఠశాలల ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న పాఠశాలలు బలహీనమయ్యేలా విద్యాసంస్కరణలు తీసుకురావొద్దని కోరారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేలా విద్యావేత్తలు మేధావులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించాలని కోరారు. అంతేకాక ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు మొదలుపెట్టి, ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పీఆర్టీయ నాయకులు జిల్లా సీహెచ్వీ.రవికుమార్, డి.వెంకటేశ్వరరావు, తూమాటి కృష్ణారెడ్డి, కొలగాని ప్రసాదరావు తదితరులు ఉన్నారు.