
మొదలుకు నిప్పు.. వాహనంపై పడిన చెట్టు
ముగ్గురికి తీవ్రగాయాలు
తిరుమలాయపాలెం: రోడ్డుపై వెళ్తున్న వాహనంపై భారీ వృక్షం పడడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుమలాయపాలెం కొక్కిరేణి స్టేజీ సమీపాన బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు... పంటలపై నీడ పడుతోందని కొందరు రైతులు రహదారి పక్కన చెట్ల మొదళ్లకు నిప్పు పెడుతున్నారు. ఇలాగే చేయడంతో చెట్టు ఒక్కసారిగా కూలగా అదే రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో వాహనంపై వెళ్తున్న బీసురాజుపల్లితండాకు చెందిన బోడ సేవ్యా, పద్మ, సుధాకర్కు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు చేరకుని జేసీబీతో చెట్టును తొలగించారు.
విధులకు ఆటంకపర్చిన ఇద్దరిపై కేసు
కారేపల్లి: అటవీ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై కారేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కారేపల్లి అటవీ రేంజ్ పరిధి గేటు రేలకాయలపల్లిలో ధర్మసోత్ సూర్యం, ఆయన కుమారుడు జేసీబీతో అటవీ భూమిలో దున్నుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ ఇమ్మడి వీరభద్రం, బీట్ ఆఫీసర్ రమాదేవి వెళ్లి అనుమతి పత్రాలు అడగగా సూర్యం, ఆయన కుమారుడు అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉద్యోగులను గెంటేశారు. దీంతో ఉద్యోగుల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.గోపి తెలిపారు.
ఎన్సీసీ కేడెట్లకు సర్టిఫికెట్లు
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన 50 మంది విద్యార్థినులు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎన్సీసీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.రజిత తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో వారికి ఖమ్మం 11(టీ) బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్ భద్ర బీ, సీ సర్టిఫికెట్లు అందజేశారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించడంపై ప్రిన్సిపాల్ రజిత, వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్య, కోఆర్డినేటర్లు ఐశ్వర్య, రజిని, రాజేశ్వరి, సీటీఓ శోభాదేవిని అభినందించారు.

మొదలుకు నిప్పు.. వాహనంపై పడిన చెట్టు