
కనీస మద్దతు ధర కోసం చట్టం చేయాలి
బోనకల్: రైతులు సాగు చేసే అన్ని పంటలకు కనీస మద్దతు ధర దక్కేలా చట్టం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు డిమాండ్ చేశారు. బోనకల్ మండలం రావినూతలలో బుధవారం నిర్వహించిన సంఘం మధిర డివిజన్ సదస్సులో ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. విత్తనాల తయారీ బహుళజాతి సంస్థల చేతుల్లో ఉండడంతో రైతులకు నష్టం జరుగుతోందని తెలిపారు. కేంద్రప్రభుత్వం వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసేలా కార్పొరేట్లకు వేలాది ఎకరాలు కట్టబెడుతోందని ఆరోపించారు. ఇకనైనా స్వామినాధన్ కమిషన్ సిఫారసులు అమలుచేయాలని కోరారు. కాగా, జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్న సీతారామ ప్రాజెక్టు పూర్తికావడం లేదని, ఈ విషయమై పోరాటానికి రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతుసంఘం మధిర డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పాపినేని రామనర్సయ్య, దొండపాటి నాగేశ్వరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, ఆహారం, ఔషధాలు, ఇంధనం కొరతతో క్యూబా దేశ ప్రజల జీవనం దుర్భరంగా మారినందున సాయానికి అందరూ ముందుకు రావాలని పోతినేని కోరారు. ఈక్రమంలో సమావేశానికి హాజరైన రైతులు సమకూర్చిన రూ.28,115 నగదును సుదర్శన్రావుకు నాయకులు అందజేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబుతో పాటు పొన్నం వెంకటేశ్వరావు, చింతలచెర్వు కోటేశ్వరావు, మడిపల్లి గోపాల్రావు, కిలారు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతు సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్రావు