
వృత్యంతర శిక్షణతో అనేక ఉపయోగాలు
ఖమ్మంరూరల్: వేసవి సెలవుల్లో ఇస్తున్న వృత్యంతర శిక్షణతో ఉపాధ్యాయులకు అనేక ఉపయోగాలు ఉన్నాయని డీఈఓ ఎస్.సత్యనారా యణ అన్నారు. మండలంలోని జలగంగనర్ ఉన్నత పాఠశాలలో ఐదురోజులుగా ఇస్తున్న శిక్షణ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఈ శిక్షణతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమై బోధన అందుతుందని తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని పి.వెన్నెల పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ప్రైవేట్ పాఠశాలల కంటే సర్కారు స్కూళ్లలో మెరుగైన బోధన అందుతుందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అనంతరం వెన్నెలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఏఎంఓ రవికుమార్, ఎంఈఓ శ్రీనివాస్, విజయలక్ష్మి, శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు.