
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే అర్చకులు స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్య కల్యాణం జరిపించారు. ఆతర్వాత తెలంగాణ, ఏపీ నుంచి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ, ఉద్యోగులు పాల్గొన్నారు.
పాలిసెట్ టాప్–15లో జిల్లా విద్యార్థులు
● 1, 9వ ర్యాంకులతో సత్తా
ఖమ్మంసహకారనగర్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను శనివారం విడుదల చేశారు. టాప్–15 ర్యాంకులతో జాబితా విడుదల చేయగా, ఇందులో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఈమేరకు తూమాటి లాస్యశ్రీ ఎంపీసీ, బైపీసీలో 120కి 120మార్కులతో రెండు విభాగా ల్లోనూ రాష్ట్ర ప్రథమస్థానం సాధించడం విశేషం. అలాగే, కాజా హరిదీప్ రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించాడు. కాగా, ఖమ్మం న్యూ విజన్ పాఠశాల విద్యార్థులు తూమాటి లాస్యశ్రీ రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు, కోట సాత్విక రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు సాధించారని ప్రిన్సిపాల్ జే.వీ.మైఖేల్ తెలిపారు. పదో తరగతి ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయి టాప్ మార్కులు సాధించిన తమ విద్యార్థులు పాలిసెట్లోనూ సత్తా చాటారని పాఠశాల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ వెల్లడించారు. ఈమేరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.