
కష్టపడే వారికే పార్టీ పదవులు
● కాంగ్రెస్ మహా వృక్షం.. అందరికీ నీడనిస్తుంది ● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి: ‘కాంగ్రెస్ పార్టీ అనేది వటవృక్షం.. ఈ పార్టీకి ఎత్తుపల్లాలు, విజయాలు సహజమే.. అయినా కాంగ్రెస్ ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేసిన మంత్రి, ఆతర్వాత జరిగిన కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గ సంస్థాగత సన్నాహక సమావేశంలో మాట్లాడారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఎందరికో పదవులు కట్టబెట్టడమే కాక త్యాగాలు, సంస్కరణలతో ప్రజలతో మమేకమైన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు చేపిన త్యాగమేంటో ప్రజలకు తెలుసునన్నారు. కాగా, ఇప్పటి వరకు పార్టీలో పనిచేస్తున్న వారు కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వారికే సంస్థాగత పదవులు వస్తాయని తెలిపారు. పార్టీ సంస్థాగత జిల్లా ఇన్చార్జి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గతంలో మాదిరి కాకుండా పార్టీని కిందిస్థాయి నుండి బలోపేతం చేసేలా దృష్టి సారించామని, మండలం నుండి గ్రామ స్థాయి వరకు అధ్యక్ష పదవులకు ఐదుగురి పేర్లతో జాబితా తయారు చేస్తామని తెలిపారు. కాగా, బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ చైర్మన్ వి.సీతారాములు, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, పార్టీ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, బత్తిన శ్రీనివాస్, స్వర్ణకుమారి, రామసహాయం వెంకటరెడ్డి, బోడ మంగీలాల్, బెల్లం శ్రీనివాస్, ఎం.గురవయ్య, కల్లెం వెంకటరెడ్డి, జెర్రిపోతలు అంజని తదితరులు పాల్గొన్నారు.
పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యం
ఖమ్మంరూరల్: పేదల ముఖాల్లో చిరునవ్వు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో పొంగులేటి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరుగుతున్నాయని తెలిపారు. తరతరాలుగా అనుభవిస్తున్న భూములపై రక్షణ కోసం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఈకార్యక్రమాల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్, ఆర్డీఓ నర్సింహారావు, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, తతహసీల్దార్ పి.రాంప్రసాద్, ఎంపీడీఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు.