
35 ఎకరాలు.. రూ.130కోట్లు
● రేపు మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన ● పాల్గొననున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అత్యాధునిక వసతులతో కూడిన భవనాలు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కాలేజీని ప్రస్తుతం పాత కలెక్టరేట్లో నిర్వహిస్తున్నారు. అయితే, అన్ని సౌకర్యాలతో కూడిన భవనాలు ఉండాలనే భావనతో రఘునాథపాలెం మండలం బాలపేట సమీపాన బైపాస్ పక్కన 35 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించారు. ఈ భూముల్లో నిర్మాణాలకు 8వ తేదీ గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లాకు చెందిన మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాన భవనం, హాస్టళ్లు
బాలపేట సమీపాన కేటాయించిన 35 ఎకరాల్లో భవన నిర్మాణాలకు రూ.130కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 3.81లక్షల చదరపు అడుగుల్లో కాలేజీ ప్రధాన భవనం నిర్మిస్తారు. అలాగే, 88 చదరపు అడుగుల్లో బాలికల హాస్టల్, 62వేల చదరపు అడుగుల్లో బాలుర హాస్టల్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే భూమి చదును చేయగా, సుమారు రూ.15 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని ఇంజనీరింగ్ శాఖ అధికారులు తెలి పారు. కాగా, గురువారం జరిగే శంకుస్థాపనకు మంత్రులు హాజరుకానుండగా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పరిశీలించి ఏర్పాట్లపై ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకూబ్, ఈఈ యుగంధర్కు సూచనలు చేశారు.