
రోడ్డెక్కిన అన్నదాతలు
కొణిజర్ల: ధాన్యాన్ని ఫలానా మిల్లుకు తీసుకెళ్లాలని సూచించి, ఆతర్వాత మరో మిల్లుకు తరలించాలని చెప్పడంతో సివిల్ సప్లయీస్ అధికారుల తీరుపై ఆగ్రహిస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. కొణిజర్ల మండలంలోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస మిల్లుకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం శనివారం ట్రాక్టర్లలో రైతులు వెళ్లగా అక్కడే నిలిపేశారు. తీరా సోమవారం మధ్యాహ్నం డీఎస్ఓ చందన్కుమార్ వచ్చి మిల్లు కోటా పూర్తయిందని వైరాలోని మిల్లుతో పాటు హనుమకొండ జిల్లా కేంద్రానికి తరలించాలని సూచించారు. అయితే, మూడు రోజుల పాటు వేచి ఉన్నాక ఇతర చోట్లకు వెళ్లాలనడంతో రైతులు వైరా – సత్తుపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వీరికి సీపీఎం, మాస్లైన్ నాయకులు బొంతు రాంబాబు, సీ.వై.పుల్లయ్య, కంకణాల అర్జునరావు మద్దతు తెలపగా, ఆందోళనతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ఎస్ఐ జి.సూరజ్, తహసీల్దార్ రాము, ఆర్ఐలు రమేష్, అశోక్ చేరుకుని రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం మిల్లు వద్ద ట్రాక్టర్ల నుంచి ధాన్యం దిగుమతి చేయించాలని, ఆతర్వాత ఇతర చోట్లకు పంపాలని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
తరుగు తీస్తున్నారని...
కల్లూరు: ధాన్యం తరుగు పేరిట మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరుపై కల్లూరులో రైతులు రాస్తారోకోకు దిగారు. పుల్లయ్యబంజర్కు చెందిన రైతులు ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకురాగా, మిల్లర్లు క్వింటాకు రెండు కేజీల తరుగు తీస్తామని చెప్పారు. దీనికి రైతులు అంగీకరించినా చివరకు 4–5 కేజీల తరుగు తీస్తుండడంతో తహసీల్లో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లారు. అక్కడ తహసీల్దార్ లేకపోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలు నిలిచిపోగా ఎస్ఐ డి.హరిత నచ్చచెప్పాక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రైతు బొల్లం నాగరాజు 700 టిక్కీల ధాన్యం తీసుకొస్తే 21 టిక్కీలు కోత పెట్టారని ఆరోపించారు. రైతులు కిష్టంశెట్టి నరసింహారావు, శివలీల కృష్ణ, పసుపులేటి సుబ్బారావు, వంగల శ్రీను, కిష్టంశెట్టి దుర్గ, పెద్దబోయిన వెంకి, మధ్యబోయిన వెంకటేశ్వరరావు, బొల్లం నాగరాజు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిల్లుల కేటాయింపులో కొర్రీలపై ఆగ్రహం