
వసతుల కల్పనకు కృషి
● రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం ● భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
మధిర: మధిర పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక సుందరయ్య నగర్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధిరలో అండర్ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలనే ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి రూ.128 కోట్లు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. యూజీడీలో భాగంగా 99.56 కిలో మీటర్ల మేర సీనరేజ్ పైప్లైన్, 6,638 గృహాలకు కనెక్షన్, నాలుగు సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పాత డంపింగ్ యార్డ్ వద్ద రాయపట్నం రోడ్డులో 5 ఎంఎల్డీ ఎస్టీపీ, మడుపల్లిలో 0.9 ఎంఎల్డీ ఎస్టీపీ, మధిర లేక్ వద్ద అంబారుపేటలో 0.4 ఎంఎల్డీ ఎస్టీపీ, ఇల్లందులపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద 0.5 ఎంఎల్డీ ఎస్టీపీ నిర్మించనున్నట్లు వివరించారు. మధిరలో మేజర్ స్టార్మ్ వాటర్ డ్రైన్, ఆర్సీసీ రిటైనింగ్ వాల్, ఓసీఈఎంఎస్ పరికరాల అమరిక పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు నిర్మాణ సంస్థే నిర్వహణ బాధ్యతలు చూడాల్సి ఉంటుందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. మధిర పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, వెంకటరమణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన
వైరా: వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం పర్యటించారు. తన స్వగ్రామమైన లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన స్నానాల ఘాట్, గదులు, ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ సమీపంలో వైరా నదిపై నిర్మించనున్న రిటైనింగ్ వాల్, చెక్డ్యామ్, ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశిత గడువు లోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుక రావాలని అధికారులకు సూచించారు.

వసతుల కల్పనకు కృషి