
పారదర్శకంగా భూసమస్యల పరిష్కారం
● రెవెన్యూ సదస్సులకు సిద్ధం కావాలి ● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మం సహకారనగర్: భూ భారతి చట్టం ద్వారా రైతులు, ప్రజలకు సంబంధించి భూసమస్యల దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన రెవెన్యూ సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. వీటిని పరిశీలిస్తూ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఇక ఈనెల 3నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని మిగిలిన అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు జరగనుండగా, ప్రతీ మండలానికి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యాన రెండేసి బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీరోజు సదస్సుల నిర్వహణపై నివేదిక ఇస్తూ, దరఖాస్తుదారులకు రశీదు అందించాలని తెలి పారు. కాగా, సదస్సు వేదికల వద్ద హెల్ప్ డెస్క్ల ఏర్పాటు, సరిపడా దరఖాస్తులు సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఒకవేళ ఎవరి దరఖాస్తులైనా తిరస్కరిస్తే అందుకు కారణాలు స్పష్టంగా తెలియచేయాలని చెప్పారు. కాగా, ఆర్ఎస్ఆర్పీఓటీ, భూ సేకరణ కేసులు, సరిహద్దు వివాదాలు, పార్ట్ బీ కేసులు, అసైన్డ్ భూముల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈసమావేశంలో ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, ఆర్డీఓలు జి.నర్సింహారావు, ఎల్.రాజేందర్గౌడ్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి విధుల్లోకి జీపీఏలు
గ్రామ పాలన అధికారులు(జీపీఓ) సోమవారం నుంచి విధుల్లోకి రానున్నారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 382 రెవెన్యూ గ్రామాలు ఉండగా, జీపీఓగా విధులు నిర్వర్తించేందుకు 255మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పరీక్షకు 225మంది హాజరుకాగా, అందులో 192మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నియామక పత్రాలు, పోస్టింగ్లు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఆపై 3వ తేదీ నుంచి గ్రామాల్లో జరిగే భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వీరు విధులు నిర్వహించే అవకాశం ఉంది.