
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు
రఘునాథపాలెం: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని.. అందులో భాగంగానే రూ.కోట్ల నిధులు కేటాయిస్తూ పాఠశాలల్లో అన్ని వసతులు సమకూరుస్తోందని జిల్లా విద్యాశాఖ సీఎంఓ యలగందుల రాజశేఖర్ తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా రఘునాథపాలెం మండలంలోని వెంకటాయపాలెం, వేపకుంట్ల తదితర గ్రామాల్లో శనివారం నిర్వహించిన ర్యాలీల్లో ఆయన పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉండగా, ఉచిత విద్య, యూనిఫాం, పాఠ్యపుస్తకాలే కాక నాణ్యమైన భోజనం అందుతోందని తెలిపారు. ఇవేకాక గత ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు నమోదైన అంశంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంపునకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కాగా, మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్య నిర్వహణపై వంట, పారిశుద్ధ్య కార్మికులకు ఈనెల 9, 10వ తేదీల్లో ఖమ్మంలో జిల్లా స్థాయి శిక్షణ, ఆతర్వాత 10, 11వ తేదీల్లో మండల, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో హెచ్ఎంలు నారాయణ, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.