
పెరుగుతున్న సూర్య ప్రతాపం
● వైరాలో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ● కోటాకు మించి విద్యుత్ వినియోగం
ఖమ్మంవ్యవసాయం: మృగశిర కార్తె వచ్చినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. సాధారణంగా మృగశిర కార్తె నుంచి వర్షాలు కురవడంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండాల్సిన రోహిణి కార్తె ఆరంభంలో నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనంతో వర్షాలు కురిసి కొద్ది రోజులు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆ తర్వాత క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం మృగశిర కార్తె ప్రారంభమైంది. ఈ కార్తెలో ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉండగా అందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఆదివారం ఎండ తీవ్రత పెరిగింది. వైరాలో గరిష్టంగా 42 డిగ్రీలు, ఇంకా అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎర్రుపాలెంలో 41.5, బచ్చోడులో 41.2, సత్తుపల్లి ఓసీ వద్ద 40.8, ఖమ్మం ప్రకాష్నగర్, ఖమ్మం ఖానాపురం, గంగారంలో 40.7, తిరుమలాయపాలెం, మధిర ఏఆర్ఎస్, కుర్నవల్లి, గౌరారం, తల్లాడలో 40.6, సత్తుపల్లి, పెద్ద గోపతిలో 40.5, పల్లెగూడెం, ఖమ్మం ఎన్ఎస్పీ, రఘునాథపాలెంలో 40.4, ముదిగొండలో 40.3, వేంసూరు, చింతకానిలో 40.2, పెనుబల్లిలో 40.1, మధిర, పమ్మిలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్టంగా బాణాపురంలో 37.3 డిగ్రీలుగా ఉంది.
పెరిగిన విద్యుత్ వినియోగం..
ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. జిల్లాకు కేటాయించే కోటాకు మించి వినియోగిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ వినియోగం అంతగా లేకున్నా గృహ వినియోగం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లా విద్యుత్ కోటా రోజుకు 4.73 మిలియన్ యూనిట్లు కాగా శుక్రవారం 5.581 మిలియన్ యూనిట్లు, శనివారం 5.611 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. అంటే రోజువారి కోటాతో పోలిస్తే దాదాపు 1 మిలియన్ యూనిట్ల విద్యుత్ అదనంగా ఖర్చవుతోంది. గృహ విద్యుత్ వినియోగం పెరగడంతో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా లో వోల్టేజీ సమస్య ఎదురవుతోంది.
దుక్కులు చేసి ఎదురుచూస్తున్న రైతులు
మే నెలలో కురిసిన అకాల వర్షాలతో దుక్కులు సిద్ధం చేసిన రైతులు విత్తనాలు వేసేందుకు వానల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండో ప్రధాన పంట అయిన పత్తి సాగుకు విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. అపరాల పంటలైన పెసర, కంది విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొందరు రైతులు వరి నారు మళ్లు దున్నుకొని విత్తనాలు సేకరించే పనిలో ఉన్నారు. 6 నుంచి 7 సెం.మీ. వర్షం కురిస్తే వెంటనే పత్తి విత్తనాలు వేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఈనెల 20 వరకు పత్తి విత్తనాలు వేసుకునే అవకాశం ఉంది.