
భూసమస్యల పరిష్కారానికి కృషి
● రెవెన్యూ సదస్సును పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ● మహిళా సమాఖ్య ద్వారా ఇసుక పాయింట్పై ఆరా
చింతకాని: భూభారతి చట్టం ద్వారా భూసమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. చింతకాని మండలం వందనంలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సును పరిశీలించిన ఆయన ఏయే సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా ప్రతీ భూసమస్యకు పరిష్కారం లభిస్తుందనే అంశాన్ని దరఖాస్తుదారులకు వివరించాలని సూచించారు. కాగా, అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన పేదలకు పట్టాలు జారీ చేస్తామని, లేదంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. ఇందుకోసం త్వరలోనే కమిటీలు ఏర్పాటు కానున్నాయని ఆయన చెప్పారు. కాగా, భూములకు దారి సమస్యపై ఓ వ్యక్తి కలెక్టర్కు వివరించగా రెవెన్యూ కోర్టులో ఆర్డర్ పాస్ చేస్తామని భరోసా కల్పించారు. భూసమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా సర్వే కోసం సర్వేయర్లు అందుబాటులోకి రానున్నారని తెలిపారు. కాగా, ప్రతీ మండల కేంద్రంలో లైబ్రరీ ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించిన ఆయన, పంటల సాగుపై అధికారులు సలహాలు ఇస్తున్నారా, లేదా అని ఆరా తీశారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, నాణ్యమైన విద్య అందుతున్నందున పిల్లలను చేర్పించాలని సూచించారు.
మహిళలు ఆదాయ మార్గాలు అన్వేషించాలి
అందుబాటులో ఉన్న వనరుల ద్వారా మహిళలు ఆదాయ మార్గాలను అన్వేషించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. చింతకాని తహసీల్ వద్ద ఏర్పాటు చేసిన సీ్త్ర టీ స్టాల్ను సందర్శించిన ఆయన వ్యాపారం వివరాలు తెలుసుకోవడంతో పాటు కాఫీ తాగి ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించారు. సీజన్కు అనుగుణంగా స్నాక్స్ విక్రయించాలని, యంత్రాంగం తరఫున సహకరిస్తామని తెలిపారు. కాగా, తహసీల్ ఎదుట సీ్త్ర శక్తి భవన నిర్మాణానికి రూ.5 లక్షలు అవసరమని ఎంపీడీఓ చెప్పగా అక్కడికక్కడే చెక్కు జారీ చేసి నెలలోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
ఇసుక అక్రమ రవాణాకు చెక్
మండలంలోని చిన్నమండవ మున్నేరు వద్ద సింధు గ్రామ సమాఖ్య ద్వారా ఏర్పాటు చేసిన ఇసుక పాయింట్ను పరిశీలించిన కలెక్టర్ నిర్వాహకులకు సూచనలు చేశారు. మహిళా సంఘాలపై ఉన్న నమ్మకంతో అప్పగించినందున కూపన్ ద్వారా మాత్రమే రవాణా జరిగేలా చూడాలని తెలిపారు. ఈసందర్భంగా సంఘం సభ్యుల వద్ద కూపన్లు, ట్రాక్టర్ జారీ చేసిన కూపన్ను పరిశీలించి జేసీబీలను అనుమతించొద్దని సూచించారు. తహసీల్దార్ కూరపాటి అనంతరాజు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఐకేపీ ఏపీఎం శ్రీనివాసరావు, సింధు గ్రామ సమాఖ్య సభ్యులు బేబీరాణి, లక్ష్మి, ఇందిర, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

భూసమస్యల పరిష్కారానికి కృషి