
టీజీ–ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ ఈసీఈటీ) ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైందని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్కు ఈనెల 14నుంచి 18వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉండగా, తమ కళాశాల ప్రాంగణంలో 17నుంచి 19వ తేదీ వరకు జరిగే కౌన్సెలింగ్కు విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ఆతర్వాత 17 నుండి 21వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇస్తే, 25వ తేదీన సీట్లు ఖరారవుతాయ ని తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాలలోని హెల్ప్డెస్క్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
సమయపాలన తప్పనిసరి
ముదిగొండ: వైద్య, ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ రామారావు ఆదేశించారు. ముదిగొండలోని పీహెచ్సీని బుధవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించాక మాట్లాడారు. ల్యాబ్లో అన్ని నిర్వహిస్తూ, అవసరమైన మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. వైద్యాధికారి అరుణాదేవి, ఉద్యోగులు లత, సత్యవతి, నాగరాజకుమారి పాల్గొన్నారు.
సాంకేతికతను జోడిస్తే అధిక దిగుబడి
కూసుమంచి: రైతులు వ్యవసాయంలో సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తే అధిక దిగుబడులు పొందొచ్చని భారతీయ వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్.పద్మావతి తెలిపారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా మండలంలోని భగవత్వీడులో రైతులకు బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఖరీఫ్ పంటల సాగులో ఆధునిక పద్ధతులు, వరి నూతన వంగడాలు, వాటితో ఉపయోగాలను వివరించి, కేంద్రప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త అక్షిత్, ప్రోగ్రాం అసిస్టెంట్ నరేష్, ఏఓ వాణి తదితరులు పాల్గొన్నారు.

టీజీ–ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల