
బడి పిలుస్తోంది..
రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
● తొలిరోజే విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్ పంపిణీ ● ఈ విద్యాసంవత్సరం 176 పాఠశాలల్లో ఏఐ బోధన ● మూతబడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్న కలెక్టర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వేసవి సెలవుల అనంతరం గురువారం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈమేరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మొదటి రోజే పాఠ్య, నోట్ పుస్తకాలతోపాటు యూనిఫామ్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే, విద్యార్థులకు సాంకేతికత ఆధారంగా పాఠాలు బోధించేలా 176 పాఠశాలల్లో ఈ ఏడాది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. కాగా, గతంలో మూతబడిన పాఠశాలల్లో బడిబాటతో విద్యార్థులను చేర్పించేలా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా కల్లూరు మండలంలోని పాయపూర్, ఓబుల్రావు బంజర, లక్ష్మీపురం పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు నిర్వహించే బడిబాటలో బుధ వారం పాల్గొననున్న కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆయా బడులను పునఃప్రారంభిస్తారు.
పుస్తకాలు, యూనిఫామ్ సిద్ధం
ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజే విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలే కాక యూనిఫామ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాకు 6,59,570 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా.. పార్ట్ –1లో 4,92,970 పుస్తకాలు కావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 4,46,410 పుస్తకాలు జిల్లాకు చేరడంతో వీటిలో 3,76,918 పుస్తకాలను మండల కేంద్రాలకు చేర్చారు. ఇక నోట్ పుస్తకాలు 1,02,773 అవసరం ఉండగా.. 56,240 చేరాయి. అలాగే, మొత్తం 1,269 పాఠశాలల్లోని 69,241మంది విద్యార్థుల యూనిఫామ్ కోసం 2,95,420 మీటర్ల క్లాత్ అవసరం ఉండగా.. ఇప్పటికే గ్రామీణ స్థాయిలో స్వయం సహాయక సంఘాలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో మెప్మా సిబ్బంది కుట్టడంలో నిమగ్నమయ్యారు. తొలిరోజు ఒక జత యూనిఫా మ్ ఇచ్చేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని స్కూళ్లలో ఐఏ బోధన
విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బో ధించేలా ప్రభుత్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విధానాన్ని ప్రవేశపెట్టింది. గత ఏడాది ప్రయోగాత్మకంగా ఏడు పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలుచేయగా విజయవంతం కావడంతో ఈ ఏడాది జిల్లాలోని 176 పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి నిర్ణయించారు. ఈ విధానంలో తెరపై చూస్తూ పాఠాలు వింటుండడంతో విద్యార్థులకు సులువుగా అర్థమవుతుందని.. చదవడంలో వెనుకబడిన వారు కూడా త్వరగా నేర్చుకుంటారని చెబుతున్నారు. అంతేకాక విద్యార్థులు ఇంగ్లిష్లో పట్టు సాధించేలా గత ఏడాది 34 పాఠశాలల్లో అమలుచేసిన ‘ఉయ్ కెన్ లెర్న్’ కార్యక్రమాన్ని ఈసారి 205 పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నారు.
పండుగ వాతావరణంలో..
కొత్త విద్యాసంవత్సరాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నాం. మొదటిరోజే పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ ఇచ్చేలా ఏర్పాట్లుచేశాం. గతంలో మూతబడిన పాఠశాలలన్నీ తెరిచే ప్రయత్నాలు చేస్తున్నాం. బడి బాటకు మంచి స్పందన వస్తున్నందున ప్రవేశాలు పెరగనున్నాయి.
– సామినేని సత్యనారాయణ,
జిల్లావిద్యాశాఖాధికారి

బడి పిలుస్తోంది..