ఎరువులకు కటకట | - | Sakshi
Sakshi News home page

ఎరువులకు కటకట

Jun 11 2025 9:02 AM | Updated on Jun 11 2025 9:02 AM

ఎరువు

ఎరువులకు కటకట

అన్నదాతలను కలవరపెడుతున్న కొరత
● సీజన్‌ వచ్చినా జిల్లాకు ఆశించిన స్థాయిలో చేరని నిల్వలు ● మరోపక్క వ్యవసాయ శాఖ అధికారుల్లోనూ హైరానా

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఎరువుల కొరత నెలకొందనే సమాచారం రైతాంగాన్ని కలవర పెడుతోంది. వానాకాలం సాగు సీజన్‌ ముంచుకొచ్చినా జిల్లాకు ఆశించిన స్థాయిలో నిల్వలు చేరలేదు. ఇప్పటికే కురిసిన వర్షాలతో రైతులు దుక్కులు చేయగా, మరో వర్షం కురిస్తే విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. దుక్కితో పాటు విత్తు మొలకెత్తాక డీఏపీ, కాంప్లెక్స్‌, సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ వంటి ఎరువులు వినియోగిస్తారు. ఇక పైరు ఎదుగుదలలో నత్రజని(యూరియా) ఎరువులను వాడతారు. జిల్లాలో ఈ వానాకాలం 7.32 లక్షల ఎకరాల్లో అన్నిపంటలు సాగు చేయనుండగా, రైతాంగానికి సరిపడా ఎరువులు లేవనే సమాచారంతో వారు ఆందోళన చెందుతున్నారు.

1.97 లక్షల మె. టన్నుల అవసరం

వానాకాలం పంటల సాగు విస్తీర్ణం ఆధారంగా జిల్లాలో 1.97 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఇండెంట్‌ సమర్పించాయి. యూరియా 1,20,904.512 మె.టన్నులు, డీఏపీ 41,719,321, ఎంఓపీ 34,800.310 మె. టన్నుల అవసరం కాగా, యూరియా కేవలం 7,884.739, డీఏపీ 3,974.429, ఎంఓపీ 511.075 మెట్రిక్‌ టన్నులే నిల్వ ఉన్నాయి. వానాకాలం సాగు సీజన్‌ మే నుంచి సెప్టెంబర్‌ వరకు ఉంటుంది. ఈ సమయంలో అవసరమైన ఎరువులను నెలవారీ కోటాగా ప్రభుత్వం సమకూరుస్తుంది. కానీ ఇప్పుడు అలా సరఫరా కావడం లేదు. యూరియా కోటాను పరిశీలిస్తే మే నెలలో 831 మెట్రిక్‌ టన్నులకు గాను 419 టన్నులు, జూన్‌ నెలలో 4,153 టన్నులకు ఇప్పటివరకు కేవలం 1,973 టన్నులే సరఫరా అయింది.

గత ఏడాదితో పోలిస్తే మరీ తక్కువ

గత ఏడాది ఎరువుల నిల్వలతో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. గడిచిన యాసంగి సీజన్‌ నుంచి ఎరువుల సరఫరా గణనీయంగా తగ్గింది. అయినా అంతకు ముందు ఉన్న నిల్వలే కాక పాత నిల్వలు, గడ్డ కట్టిన యూరియా సైతం పంపిణీ చేసి సీజన్‌ వెళ్లదీశారు. జనవరి నుంచి సరఫరా మరింత తగ్గడంతో ఇబ్బందులు ఎదురుకాగా, పలుచోట్ల రైతులు ఆందోళనలు చేశారు. గత ఏడాది మే నెల నాటికి జిల్లాలో 77,377.907 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో కేవలం 28,891.01 మెట్రిక్‌ టన్నుల ఎరువులే నిల్వ ఉండడం గమనార్హం. దీనికి తోడు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల కోసం ఖమ్మం స్టేషన్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన రేక్‌ పాయింట్‌ను పందిళ్లపల్లికి మార్చారు. ఈక్రమంలో కోడ్‌ కేటాయింపు ఆలస్యం కాగా జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఎరువుల సరఫరా నిలిచిపోయింది. జిల్లాలో నిల్వలు తగ్గడానికి ఇదో కారణమని చెబుతున్నారు. ఇప్పుడు సాగు సీజన్‌ ప్రారంభమైనా సరిపడా ఎరువుల లభ్యత లేక వ్యవసాయ శాఖ అధికారులు హైరానా పడుతున్నారు. కాగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా వాసి కావడంతో ఇక్కడ సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటారని యంత్రాంగం, రైతులు భరోసా వ్యక్తం చేస్తుండగా.. ఎలాంటి ఫలితాలు రానున్నాయో వేచి చూడాలి.

బ్లాక్‌ మార్కెట్‌కు తరలింపు?

ఎరువుల కొరతను పసిగట్టిన వ్యాపారులు ఉన్న నిల్వలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేలా రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పలువురు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడినట్లు తెలిసింది. నిల్వలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి అధిక ధరకు అమ్ముకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాక పర్యవేక్షించే యంత్రాంగాన్ని తమ దారికి తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో ప్రస్తుతం ఎరువుల నిల్వలు (మె. టన్నుల్లో)

ఎరువు నిల్వ

యూరియా 7,884.739

డీఏపీ 3,974.429

ఎంఓపీ 511.075

ఎన్‌పీకే 14,148.52

ఎస్‌ఎస్‌పీ 1,912.63

కంపోస్టు 49.65

ఎఫ్‌ఓఎం 109.97

మొత్తం 28,591.013

కొరత రాకుండా పర్యవేక్షణ

సాగు సీజన్‌కు ఎరువుల కొరత రాకుండా చూస్తాం. పంటల సాగు ఆధారంగా అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక రూపొందించాం. రైతులు కూడా విచ్చలవిడిగా ఎరువులు వినియోగించకుండా అవగాహన కల్పిస్తున్నాం. అలాగే, విక్రయాల్లో అక్రమాలు జరగకుండా నిఘా పెట్టాం.

– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

నెల వారీగా జిల్లాకు అవసరమైన ఎరువుల వివరాలు (మెట్రిక్‌ టన్నుల్లో)

నెల యూరియా డీఏపీ ఎంఓపీ ఎన్‌పీకే ఎస్‌ఎస్‌పీ

మే 831 265 209 888 68

జూన్‌ 4,153 3,970 1,043 4,439 1,019

జూలై 12,460 6,616 3,129 13,317 1,698

ఆగస్టు 16,614 5,293 4,171 17,756 1,359

సెప్టెంబర్‌ 20,767 1,323 5,214 22,195 340

మొత్తం 54,825 17,467 13,766 58,595 4,484

ఎరువులకు కటకట1
1/2

ఎరువులకు కటకట

ఎరువులకు కటకట2
2/2

ఎరువులకు కటకట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement