
పట్టాలెక్కని ‘ప్రీ స్కూల్’
● భర్తీకి నోచుకోని అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు ● ఉన్న వారిపై అదనపు భారం ● టీచర్లు లేక తగ్గుతున్న ప్రవేశాలు
ఎర్రుపాలెం: జిల్లాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీ స్కూల్ విద్య(పూర్వ ప్రాథమిక విద్య) జిల్లాలో పక్కదారి పడుతోంది. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 1,840 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 6 నెలల నుంచి మూడేళ్ల పిల్లలు 34,691 మంది, 3 – 6 సంవత్సరాల వయసు చిన్నారులు 20,012 మంది ఉన్నారు. వీరితో పాటు 12,715 మంది గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందిస్తున్నారు. కాగా అనేక అంగన్వాడీ కేంద్రాల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఇతర శాఖల్లో సిబ్బంది, ఉపాధ్యాయుల కొరత ఉండడంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు సర్వేలకు అంగన్వాడీ టీచర్లనే వినియోగిస్తున్నారు. ఇక టీచర్ పోస్టు ఖాళీగా ఉన్న కేంద్రాల్లో పక్క సెంటర్ కార్యకర్తకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇలా ఇతర విధుల్లో వారు నిమగ్నమవుతుండగా.. కేంద్రాల్లో టీచర్లు లేరంటూ చిన్నారులను పంపేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. చాలా అంగన్వాడీ కేంద్రాల్లో 5 నుంచి 8 మంది పిల్లలు మాత్రమే ఉంటున్నారు. పలుచోట్ల కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేక చిన్నారులకు అందాల్సిన పోషకాహారం కూడా పంపిణీ కావడం లేదు. ఇలాంటి కారణాలతో పూర్వ ప్రాథమిక విద్య పక్కదారి పడుతోంది.
వేధిస్తున్న కొరత..
జిల్లాలో 1,840 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 123 మంది టీచర్లు, 620 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మధిర ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మధిర, వైరా, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో 31 టీచర్ పోస్టులు, 84 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో ఉన్నవారిపై మరింతగా భారం పడుతోంది. ఉన్న వారితోనూ వివిధ ప్రభుత్వ శాఖల సర్వేలు, వర్షాకాలంలో వారానికి రెండు సార్లు గ్రామాల్లో శానిటేషన్ విధులు, వైద్య శాఖ నిర్వహించే డీవార్మింగ్ మందుల పంపిణీ, పల్స్ పోలియో, ఇంటింటి సర్వే, ఇందిరమ్మ ఇళ్ల సర్వే, బడిబాట తదితర పనులు చేయిస్తున్నారు. దీంతో టీచర్లపై పనిభారం పెరగగా.. వేతనాలు మాత్రం అంతంతగానే అందుతున్నాయి.