
ఆడకుండానే సర్టిఫికెట్లు..!
● జాతీయస్థాయి పోటీలకు వెళ్తున్న నకిలీ క్రీడాకారులు ● ప్రోత్సహిస్తున్న క్రీడా సంఘాలు ● స్కూల్ గేమ్స్లో మరింత విచ్చలవిడిగా..
ఖమ్మం స్పోర్ట్స్ : క్రీడలపై అవగాహన లేకపోయినా సరే తామే జాతీయస్థాయిలో ఆడించేలా చర్యలు తీసుకుంటే ఎంత ఇస్తారంటూ బేరసారాలు సాగిస్తున్నాయి కొన్ని క్రీడా సంఘాలు. ఈ వ్యవహారం టీం క్రీడల్లో ఎక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా క్రీడా సంఘాల ప్రతినిధులు సైతం జోక్యం చేసుకోవడంతో ఈ దందా మరింత విచ్చలవిడిగా కొనసాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా నకిలీ క్రీడాకారులు కేవలం టీం క్రీడాంశాల్లోనే జిల్లా, రాష్ట్ర జట్లలో ఎంపికై జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ టీం గేమ్కు సంబంధించిన జట్టులో సగం మంది ఆడే క్రీడాకారులను తీసుకుని, మిగిలిన జట్టు సభ్యులుగా ఎక్కువ డబ్బు ఇచ్చిన వారిని పెడుతున్నారని తెలుస్తోంది. గతంలో అప్పటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొన్ని క్రీడా సంఘాలకు మొట్టికాయలు వేసినా.. క్రీడా సంఘాల్లో మార్పు లేదు. దీనిని నియంత్రించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, రాష్ట్ర ఒలింపిక్ సంఘం క్రీడాకారుల ఎంపిక దశలోనే ఒక కమిటీ వేసి నకిలీ క్రీడాకారులకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. జిల్లా స్థాయిలోనే అయా క్రీడా సంఘాలు నిర్వహించే ఎంపికల్లో సదరు క్రీడాకారుడు ఆడుతున్నడా లేదా అనేది పరిశీలించేందుకు కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం టీం గేమ్స్లోనే కాకుండా వ్యక్తిగత క్రీడాంశాల్లో కూడా నకిలీ క్రీడాకారులను సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పాఠశాలల క్రీడల్లో అధికం..
క్రీడా సంఘాలకే పరిమితం చేయకుండా రాష్ట్ర పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వార్యాన జరిగే వివిధ క్రీడా పోటీల్లోనూ సగం మంది నకిలీ క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు వెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. ముందుగా రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల సమయంలో జట్టును ప్రకటించకుండా తర్వాత ప్రకటిస్తామని చెప్పి.. తీరా జాతీయ పోటీలకు జట్టు వెళ్లే సమయంలో క్రీడాకారులకు సమాచారం అందించి ఒకరోజు ముందుగానే రావాలని చెబుతున్నారు. దీంతో వివిధ కారణాలతో ఎంపికై న క్రీడాకారులు రాలేకపోతే ముందస్తుగానే తమ వద్ద ఉన్న నకిలీ క్రీడాకారులను నేరుగా జాతీయ పోటీలకు తీసుకెళ్తున్నారనే విమర్శలున్నాయి.