
ప్రొటెక్షన్ ఇచ్చేనా ?
కరుణగిరి వద్ద మున్నేరు పక్కన నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్
గత రెండేళ్లుగా వర్షాకాలం వచ్చిందంటే చాలు మున్నేరు పరీవాహక ప్రాంత కాలనీల వాసులు హడలెత్తుతున్నారు. మున్నేరుకు కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదలు ఖమ్మంరూరల్, ఖమ్మం నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 2023లో వరదలు రాగా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ముంపు నుంచి ప్రజలను రక్షించేందుకు శాశ్వత పరిష్కారంగా రిటైనింగ్ వాల్ నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.690 కోట్లు మంజూరు చేసింది. ఇక గతేడాది సెప్టెంబర్లో మరింత ఉధృతంగా వచ్చిన వరదలతో ఈ ప్రాంతమంతా కకావికలమైంది. వరదల నుంచి రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభమైనప్పటికీ పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖమ్మం రూరల్ వైపు 4.50 కిలోమీటర్ల మేరకు నిర్మాణం పూర్తయింది. ఇక ఖమ్మం నగరం వైపు భూసేకరణ సమస్య కారణంగా 250 మీటర్ల నిర్మాణం మాత్రమే జరిగింది. దీంతో ఈ వర్షాకాలం ఎలా ఉంటుందోననే ఆందోళన లోతట్టు ప్రాంతాల ప్రజల్లో నెలకొంది.
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం