
జలపుష్పాల జాతర..
నేడు మృగశిర కార్తె
● జిల్లాలో 150టన్నుల మేర చేపల విక్రయానికి ఏర్పాట్లు ● స్థానిక చెరువుల నుంచే కాక ఏపీ నుంచి దిగుమతి
ఖమ్మంవ్యవసాయం: మృగశిర అనగానే గుర్తుకొచ్చేది చేపలు. ఈ కార్తె తొలిరోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. మృగశిర వచ్చిందంటే వర్షాకాలం ఆరంభమైనట్లుగా భావిస్తారు. ఇదేరోజు హైదరాబాద్లో ఉబ్బసం, ఆయాసం ఉన్న వారికి చేపమందు వేస్తుంటారు. వేసవిలో ఉష్ణోగ్రతలతో శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుందని, చేపల తింటే వేడి దూరమవుతుందని నమ్ముతారు. అందుకే ఏటా మృగశిర కార్తె ఆరంభమవుతున్న ఆదివారం చేపల విక్రయాలు జోరుగా సాగనున్నాయి.
ఇప్పటికే దిగుమతి
జిల్లాలో మృగశిర కార్తె సందర్భంగా దాదాపు 150 టన్నులక పైగా చేపలు అమ్ముడవుతాయని అంచనా. ఈమేరకు విక్రయదారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో మార్కెట్లు, ప్రధాన కూడళ్లలో ఆదివారం చేపల విక్రయాలు భారీగా జరుగుతాయని భావిస్తున్నారు. కేవలం ఖమ్మం నగరంలోనే సుమారు 40 నుంచి 50 టన్నుల చేపలు విక్రయించే అవకాశముంది.
చేపల లభ్యత లేక...
చేపల లభ్యత జిల్లాలో తక్కువగా ఉండడంతో వ్యాపారులు ఏపీలోని పలు జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో వాహనాల్లో చేపలు తెప్పించగా ఐస్బాక్సులు, ఆక్సిజన్ ట్యాంకుల్లో నిల్వ చేశారు. ఎక్కువగా ఏలూరు, కై కలూరు, బాపట్ల, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి తెప్పించినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
రకం ఆధారంగా డిమాండ్
కొన్ని నెలల క్రితం కోళ్లకు వైరస్, బర్డ్ ఫ్లూ వస్తుందన్న ప్రచారంలో అమ్మకాలు పడిపోయాయి. అదే సమయాన మటన్, చేపల విక్రయాలు జోరందుకున్నాయి. కానీ మటన్ ధర ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఆదివారం వస్తే చేపల వైపే మక్కువ చూపుతున్నారు. ఇక మృగశిర కార్తె సందర్భంగా డిమాండ్తో పాటే ధర పెరుగుతుందని భావిస్తున్నారు. సహజంగా కొర్రమేను చేపలకు అధిక ధర ఉంటుంది. ఇవి కాక బొచ్చలు, రవ్వలు, గ్యాస్కట్లు, బంగారు తీగలు వంటి రకాల ధర కిలోకు రూ.200 నుంచి రూ.220 వరకు పలికే అవకాశముంది.
తిరుమలాయపాలెంలోని చెరువులో
చేపలు పడుతున్న మత్స్యకారులు

జలపుష్పాల జాతర..

జలపుష్పాల జాతర..