
పారదర్శకత.. వేగం
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు
● కొత్తగా ఆధార్ ఈ–సంతకం సేవలు ● పైలట్గా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ● రేపటి నుంచి అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం
ఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పౌర సేవలను మరింత వేగవంతం చేయడమే కాక పారదర్శకత పెంపునకు సంస్కరణలు తీసుకొస్తోంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన సంక్లిష్ట ప్రక్రియలను సరళీకృతం చేస్తూ, నూతన విధానాలు అమల్లోకి తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయిన అధికారులను బదిలీ చేశారు. ఆపై రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునికీకరించడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ఇకపై ఆధార్ ఈ–సంతకం
పౌర సేవలను సులభతరం చేసేలా ఆధార్ అనుసంధానంతో కూడిన ఈ–సంతకం సేవల అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఇది భౌతికంగా కార్యాలయంలో దస్త్రాలపై సంతకాలు తగ్గించడం, డాక్యుమెంట్లు తయారు చేశాక కార్యాలయానికి వచ్చినప్పుడు మళ్లీ సంతకాలు పెట్టే పని లేకుండా ఉపకరిస్తుందని చెబుతున్నారు. డాక్యుమెంట్లపై డిజిటల్ సంతకాల ద్వారా లావాదేవీలను పూర్తి చేయడంలో సమయం తగ్గి, మానవ జోక్యాన్ని తగ్గించినట్లవుతుందని.. తద్వారా అవినీతికి ఆస్కారముండదని భావిస్తున్నారు. అంతేకాక డిజిటల్ సంతకాలు అత్యంత సురక్షితంగా, ట్యాంపరింగ్కు వీల్లేకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్కు వచ్చిన వారు భౌతికంగా వేలిముద్రలు వేసే పని లేకుండా... ఒక వేలి ముద్రను స్కానింగ్ చేస్తే ఆధార్ వెబ్సైట్ ద్వారా వారి సదరు వ్యక్తి అన్ని వేళ్ల ముద్రలు ఆన్లైన్లోకి వచ్చేస్తాయని.. తద్వారా పని సులువవుతుందని భావిస్తున్నారు.
అన్ని ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీని తగ్గించడం.. పనులు త్వరగా పూర్తయ్యేలా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుచేయనున్నారు. ఈ విధానం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు కూసుమంచి, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే కాక రాష్ట్రంలోని ఇంకొన్ని కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. ఇది విజయవంతమైన నేపథ్యాన స్లాట్ బుకింగ్ విధానాన్ని అన్ని కార్యాలయాలకు విస్తరించనున్నారు. కాగా, ఈ విధానంతో ఆయా కార్యాలయాల్లో సకాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తిచేయడంతో పాటు గంటల వ్యవధిలోనే దస్త్రాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అందిస్తున్నారు.
ఉత్తమమైన సేవలు
డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు ఆన్లైన్ ద్వారా ముందే తమ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో నిర్దేశిత సమయానికి వస్తే త్వరగా పని పూర్తవుతుంది. ఫలితంగా గంటల తరబడి వేచి ఉండే ఇక్కట్లు తీరినట్లేనని చెబుతున్నారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వేగం పెరుగుతోంది. ఇలాంటి సంస్కరణలతో ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ మరింత చేరువ కావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
పైలట్ ప్రాజెక్ట్గా కూసుమంచి
నూతన విధానం అమలుకు పైలట్ ప్రాజెక్ట్గా రాష్ట్రంలోని రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో జిల్లాలోని కూసుమంచి కార్యాలయం కూడా ఉంది. రెండు కార్యాలయాల్లో ఆధార్ ఈ–సంతకం విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, మార్పులు అవసరమైతే చేశాక రాష్ట్రంలోని అన్ని సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరించనున్నారు. కాగా, కూసుమంచిలో ఒకటి, రెండు రోజుల్లోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

పారదర్శకత.. వేగం

పారదర్శకత.. వేగం