భూముల రీసర్వేతో రైతులకు మేలు | - | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వేతో రైతులకు మేలు

Jun 4 2025 12:23 AM | Updated on Jun 4 2025 12:23 AM

భూముల

భూముల రీసర్వేతో రైతులకు మేలు

● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● ములుగుమాడులో సదస్సు, సర్వేను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ● పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల

ఎర్రుపాలెం: రాష్ట్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా భూముల రీసర్వే చేపట్టనుండగా రైతులకు మేలు జరగడమే కాక భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూముల రీ సర్వే, భూభారతి సదస్సును మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు మాట్లాడారు.

ఎవరిపై భారం పడకుండా సర్వే

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడమే కాక ఎవరికీ రూపాయి కూడా ఖర్చు లేకుండా భూముల రీసర్వే చేసి రికార్డులకు భద్రత కల్పిస్తామని భట్టి, మంత్రులు వెల్లడించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ధరణి చట్టం స్థానంలో భూభారతి తీసుకొచ్చామని తెలిపారు. తద్వారా ప్రతీ భూకమతానికి ఆధార్‌కార్డు మాదిరి భూధార్‌ ఇస్తామని చెప్పారు. అంతేకాక ఏటా సదస్సులు నిర్వహించి అమ్మకాల, కొనుగోలు వివరాలను అప్‌డేట్‌ చేస్తామని తెలిపారు. భూ సంస్కరణల కారణంగా రాష్ట్రంలో దాదాపు 26లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను పేదలకు పంపిణీ చేస్తే, గత పదేళ్లలో ఎక్కడా కమిటీలు కానరాలేదని పేర్కొన్నారు. ఈనేపథ్యాన కొత్త చట్టంతో కమిటీలు ఏర్పాటు చేసి మిగులు భూములను ఇంటి పట్టాలుగా, సాగుకు పంపిణీ చేస్తామని వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న భూమి కంటే ఎక్కువగా రికార్డుల్లో నమోదు చేయించి రైతుబంధు నిధులు కాజేశారని, ఇలాంటివన్ని ఇక సాగవని స్పష్టం చేశారు. అంతేకాక గ్రామ పాలనాధికారులు, లైసెన్సు సర్వేయర్ల నియామకంతో రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు.

త్వరలోనే రైతు భరోసా

ఈసంవత్సరం వరి నాట్ల కంటే ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాగా, నక్షాలు లేకుండా రాష్ట్రంలోని 413 గ్రామాల్లో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతుండగా తాజాగా చేపడుతున్న రీ సర్వేతో ఈ సమస్య పరిష్కారమవుతాయని వెల్లడించారు. కాగా, ధరణి చట్టంలోని లోపాలతో ఎదురైన ఇబ్బందులు పలువురు రైతులు వివరించారు. అనంతరం భూముల రీసర్వేతో లాభాలను సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, సర్వే సెటిల్‌మెంట్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాష్‌, కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో లాండ్‌ అండ్‌ సర్వే జేడీ ప్రసన్నలక్ష్మి, పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌, వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్‌ ఎం.ఉషాశారద, మార్కెట్‌ చైర్మన్‌ బండారు నర్సింహారావు, డీసీసీబీ చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వరరావు, డైరెక్టర్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డితో పాటు చావా రామకృష్ణ, గంటా తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

భూముల రీసర్వేతో రైతులకు మేలు1
1/1

భూముల రీసర్వేతో రైతులకు మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement