
పథకాల్లో రాజకీయాలు ఉండవు...
ఖమ్మం రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందించడంలో రాజకీయాలకు తావుండదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రూరల్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి లబ్ధిదారులకు ఆయన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే వారి నుంచి వచ్చే స్పందన అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా మొదటి దశలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, దశల వారీగా అందరికీ మంజూరు చేస్తామన్నారు. కాగా, రూరల్ మండలంతో పాటు కేఎంసీ పరిధి 60వ డివిజన్ రామన్నపేటలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూనే సకాలంలో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, సీపీ సునీల్దత్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్లు అభిషేక్ అగస్త్య, శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ రాంప్రసాద్, డీఎల్పీఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి
కూసుమంచి: అనారోగ్యంతో బాధపడే పేదలు చికిత్స చేయించుకునేలా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అండగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో 348 మందికిరూ.1.58 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన బుధవారం అందజేసి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10లక్షల విలువైన వైద్యసేవలు ఉచితంగా అందిస్తూనే, సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.వందలాది కోట్ల సాయం మంజూరు చేస్తున్నామని తెలిపారు. కూసుమంచి మండలంలోని గట్టుసింగారం, గైగోళ్లపల్లి, పాలేరు, చేగొమ్మ, నాయకన్గూడెం గ్రామాల్లో బీటీ, సీసీ రహదారుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అన్యాయం జరిగిందని పలువురు పేర్కొనగా విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, సీడీసీ చైర్మన్ ఎరబోలు సూర్యనారాయణరెడ్డితో పాటు మల్లె గురవయ్య, జూకూరి గోపాలరావు, రామసహాయం వెంకటరెడ్డి, ఎడవెల్లి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
దశల వారీగా అర్హులందరికీ
ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పథకాల్లో రాజకీయాలు ఉండవు...