
నష్ట నివారణే కీలకం
ఖమ్మం సహకారనగర్: విపత్తు సమయంలో నష్టాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళిక ఉండాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్(డీడీఎంపీ) సమావేశం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించగా పోలీస్ కమిషనర్ సునీల్దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది వరదలతో నష్టం జరిగిన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేయాలన్నారు. ఈనెల 15 నుంచి మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసే వర్షం ఆధారంగా నదీ ప్రవాహాల వివరాలను వాట్సప్ గ్రూపుల ద్వారా సేకరిస్తూ హెచ్చరికలను ప్రభావిత ప్రాంతాలకు చేరవేయాలని సూచించారు. అంతేకాక ముంపు ప్రాంతాల ప్రజల కోసం ముందస్తుగా పునరావాస కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. అలాగే, కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులను గుర్తించి అప్రమత్తం చేయాలన్నారు. సీపీ సునీల్దత్ మాట్లాడుతూ వరదల సమయాన ప్రజలకు రక్షణ కల్పించడంలో తమ శాఖ పూర్తిగా అందుబాటులో ఉంటుందని తెలిపారు. అనంతరం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడగా జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.
విపత్తు సమయాన
హెచ్చరికలు క్షేత్రస్థాయికి చేరాలి
డీడీఎంపీ సమావేశంలో
కలెక్టర్ ముజమ్మిల్ఖాన్