‘బడిబాట’కు వేళాయె... | - | Sakshi
Sakshi News home page

‘బడిబాట’కు వేళాయె...

Jun 4 2025 12:23 AM | Updated on Jun 4 2025 12:23 AM

‘బడిబాట’కు వేళాయె...

‘బడిబాట’కు వేళాయె...

● ఈనెల 6నుంచి నిర్వహణకు సన్నాహాలు ● ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేలా చర్యలు

ఖమ్మంసహకారనగర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థుల తగ్గుముఖం పడుతోందని గణాంకాలతో సహా వివరించారు. అంతేకాక ఈ సారి ప్రవేశాలు పెరిగేలా కృషి చేయాలని సూచించడంతో అధికారులు ఈనెల 6వ తేదీ నుంచి ‘బడి బాట’ నిర్వహణకు సిద్ధమవుతున్నారు.

గత ఏడాది తగ్గారు...

జిల్లాలోని 1,214 పాఠశాలల్లో 69వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, అంతకు ముందు సంవత్సరం కంటే గత ఏడాది సుమారు 6వేల మేర తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో పలు పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు వేసవి సెలవులు మొదలైనప్పటి నుంచే ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ పంపిణీ, ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా వస్తున్న ఫలితాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఈసారి పకడ్బందీగా..

గతంలో ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పది రోజుల పాటు బడిబాట నిర్వహించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. గత ఏడాది ఆగస్ట్‌ 31 వరకు బడిబాట నిర్వహించగా, 12వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు చెబుతున్నారు. అయితే, ఇంత తక్కువ సంఖ్యలో ప్రవేశాలు జరగడంపై సమీక్షించిన విద్యాశాఖ అధికారులు ఈసారి మరింత పకడ్బందీగా బడిబాట నిర్వహించేలా సన్నద్ధమయ్యారు. కొన్ని పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, డిజిటల్‌ బోధన, ఇతర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తుండ డం.. ఈసారి బడిబాట ముందుగా నిర్వహిస్తుండడంతో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.

షెడ్యూల్‌ ఇలా..

బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 6వ తేదీన గ్రామసభలు నిర్వహిస్తారు. ఇక 7వ తేదీన ఇంటింటికీ వెళ్లి బడిఈడు పిల్లలను గుర్తించడం, 8 నుంచి 10వ తేదీ వరకు కరపత్రాలతో ప్రచారం చేస్తారు. డ్రాపౌట్‌ పిల్లలను బడిలో, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను భవిత కేంద్రంలో చేర్పిస్తారు. ఆయా కార్యక్రమాలపై 11వ తేదీ సమీక్షించుకుని, 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యాన పాఠశాలలను ప్రారంభిస్తారు. తొలిరోజునే రాత, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌ అందించడమే కాక 13వ తేదీన సామూహిక అక్షరాభ్యాసం, బాలల సభ నిర్వహిస్తారు. ఇక 16వ తేదీన ఫౌండేషనల్‌ లిటరసీ, న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌), లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ (ఎల్‌ఐపీ) దినోత్సవం, 17న విలీన విద్య, బాలికా విద్య దినోత్సవం, 18న తరగతి పాఠశాలల డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యత విద్యార్థులకు తెలియజేస్తారు. చివరగా 19వ తేదీన బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలను నిర్వహిస్తారు.

విస్తృతంగా అవగాహన

ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 6నుంచి బడిబాట నిర్వహించేలా సన్నద్ధమవుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, ఇతర సౌకర్యాలు, పదో తరగతి ఫలితాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. గతంలో కంటే ఈ ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పెరగడమే లక్ష్యంగా కృషి చేస్తాం.

– సామినేని సత్యనారాయణ, డీఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement