
అర్ధ సెంచరీ వేడుకకు ముస్తాబు
మధిర: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము... చదువులమ్మ చెట్టు నీడలో... అంటూ 55 బ్యాచ్ల పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోనున్నారు. ఐదు దశాబ్దాలుగా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన పలువురు దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ కళాశాల ప్రారంభించి 56ఏళ్లు అవుతుండగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మధిరలో ఆదివారం(ఈనెల 8న) జరిగే ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరుకాను న్నారు. ఈనేపథ్యాన ఆనాటి గురువులు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులను ఆహ్వానిస్తూ కొద్దినెలలుగా నిర్వహణ కమిటీ కృషి చేస్తోంది.
1969లో ప్రారంభం
మధిరలోని మధిర – వైరా ప్రధాన రహదారి పక్కన పదెకరాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను 1969లో స్థాపించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ ఈసీ గ్రూపులు ఉండగా.. అప్పట్లో సీటు సాధించడం గొప్పగా భావించేవారు. పదో తరగతిలో ప్రథమ శ్రేణి మార్కులు సాధించిన వారికే సీటు దక్కేదని చెబుతారు. కళాశాల స్థాపించాక 1995 వరకు ప్రైవేట్ కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులతో కళకళలాడింది. కానీ ప్రైవేట్ కళాశాలలు ఏర్పడ్డాక ప్రభుత్వ కాలేజీ పరిస్థితి ఏటేటా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కాగా, 1993లో వృత్తి విద్యా కోర్సులైన ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ కోర్సులు, 2011లో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్డబ్ల్యూ) కోర్సు ప్రారంభమైంది.
అవార్డులు.. దాతల చేయూత
ఈ కళాశాలలో చదువుకున్న అనేక మంది ఉన్నత స్థాయికి చాటారు. 2017లో ప్రభుత్వం ప్రతిభా అవార్డులు ప్రకటించగా.. ఈ కాలేజీ విద్యార్థిఉదయ్ సిద్ధార్థ్ రాష్ట్రస్థాయిలో అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం కళాశాలలో 344 మంది ఉన్నారు. ఇటీవల కళాశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నూతన భవన సముదాయానికి రూ.5కోట్లు మంజూరు చేయడంతో భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మూడెకరాల స్థలం వదిలేసి, మిగతా స్థలాన్ని తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్కి కేటాయించాలని నిర్ణయించారు.
ఉత్సవాలతో మరింత అభివృద్ధి
వేలాది మంది విద్యార్థుల తలరాతలను తీర్చిదిద్దిన కళాశాల స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 2020నాటికే కళాశాల స్థాపించి 50ఏళ్లు పూర్తయినా కోవిడ్ తదితర కారణాలతో స్వర్ణోత్సవ వేడుకలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈనెల 8న ఉత్సవాలు నిర్వహిస్తుండడంతో బ్యాచ్ల వారీగా గురువులు, పూర్వవిద్యార్థులకు సమాచారం ఇచ్చారు.
ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు
మధిర ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివిన పలువురు ఉన్నత స్థానాలకు చేరారు. పల్మనాలజిస్ట్ వరికూటి సుబ్బారావు, మరద్వాడా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బండి వెంకటేశ్వర్లు, టీజీఎన్పీడీసీఎల్ సీజీఎం వంగూరి మోహన్రావు, ప్రముఖ దంత వైద్యులు పారుపల్లి కరుణాకర్, ఆకాశ్ క్షిపణి ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి, డీఆర్ డీఎల్ మాజీ సీనియర్ శాస్త్రవేత్త, బ్రహ్మోస్ మిస్సైల్ ప్రోగ్రామ్ మేనేజర్ గుడిశ రాజేశ్వరరావు, అలీ యావర్ జంగ్ జాతీయ భాషణ, శ్రవణ దివ్యాంగ జనుల సంస్థ సికింద్రాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ భీమని శ్రీనివాసరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
రేపు మధిర జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు
ఒకే వేదికపై కలుసుకోనున్న
55బ్యాచ్ల విద్యార్థులు
దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో
స్థిరపడిన పలువురు
ఏర్పాట్లలో నిమగ్నమైన
‘గోల్డెన్ జూబ్లీ’ కమిటీ
అభివృద్ధికి సహకరించండి
ఎందరినో తీర్చిదిద్దిన మధిర కాలేజీ అభివృద్ధికి అంతా సహకరించాలి. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉన్నందున నాణ్యమైన విద్య అందిస్తున్నాం. పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకల నిర్వహణతో పాటు కళాశాల అభివృద్ధికి నిర్ణయించడం అభినందనీయం. – బి.జైదాస్, ప్రిన్సిపాల్

అర్ధ సెంచరీ వేడుకకు ముస్తాబు

అర్ధ సెంచరీ వేడుకకు ముస్తాబు