
ఎస్సెస్సీ టాపర్ల ఢిల్లీ యాత్ర
ఖమ్మంగాంధీచౌక్: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి టాపర్లుగా నిలిచిన విద్యార్థలను మిత్ర ఫౌండేషన్ ద్వారా విమానంలో ఢిల్లీ యాత్రకు తీసుకెళ్లారు. ప్రతిభ కనబర్చిన తొమ్మిది మంది విద్యార్థులకు రూ.3 లక్షల నగదు, ఒక ల్యాప్టాప్ అందించిన ఫౌండేషన్ బాధ్యులు ఢిల్లీ పర్యటనకు కూడా తీసుకెళ్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా మిత్ర ఫౌండేషన్ చైర్మన్ కురివెళ్ల ప్రవీణ్కుమార్ ఆధ్వర్యాన విద్యార్థులు పచావ వెన్నెల, మాఘం యశ్వంత్, చింతోసు సాయితో పాటు మరో ఆరుగురిని విమానంలో ఢిల్లీ తీసుకెళ్లగా పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవనం, అక్షరధామ్, ఎర్రకోట, ఇండియా గేట్ తదితర ప్రాంతాలను సందర్శించారు. అలాగే, కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిని కలిసి ఆయన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ విమానంలో ఢిల్లీకి వెళ్లడం తమకు జ్ఞాపకంగా నిలిచిపోతుందని తెలిపారు. యాత్రకు సహకరించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, డీఈఓ సత్యనారాయణకు ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్కుమార్, కార్యదర్శులు రంగ శ్రీనివాస్, నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.