
‘మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ’
మధిర: దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మత విద్వేషాలు రగిలించడమే కాక హిందూ దేశం స్థాపనకు యత్నిస్తోందని ప్రొఫెసర్ డాక్టర్ రామ్ పునియాని విమర్శించారు. మధిరలో ముసిం ఐక్య సంఘం అధ్యక్షుడు ముజాహిద్ ఇషాతి, ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ అధ్యక్షతన బుధవారం ఈద్ మిలాప్తో పాటు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సభ నిర్వహించారు. ఈ సభలో రామ్ పునియానీ మాట్లాడుతూ 11ఏళ్లుగా అధికారం చెలాయిస్తూ మనుధర్మం తీసుకురావడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది హిందూ, ముస్లింలకే కాక అందరికీ ప్రమాదమేనని తెలిపారు. అనంతరం రాంపూర్(ఉత్తరప్రదేశ్) ఎంపీ మోహిబ్బుల్లా నద్వీ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చెప్పారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ హఫిజ్జుల్ రెహమాన్ తదితరులు మాట్లాడగా మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీక్ అన్సారీ, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావుతో పాటు పోతినేని సుదర్శన్, అంజాతుల్లా ఖాన్ ఖలీద్, సయీద్ అహ్మద్ ఖాష్మీ, అసాద్, ఇలియాస్, ముఫ్తీ జలాలుద్దీన్, ఖాదర్, జవ్వాద్ అహ్మద్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.