కన్నడలో నామఫలకాలు ఏర్పాటు చేయాలి
రాయచూరు రూరల్: నగరంలో వ్యాపారస్తులు దుకాణాలు, హోటళ్లపై కన్నడ భాషలో నామఫలకాలు ఏర్పాటు చేయాలని నమ్మ కర్ణాటక సేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు కొండప్ప మాట్లాడారు. నవంబర్ నుంచి కన్నడ రాష్ట్రావతరణ సందర్భంగా ఖచ్చితంగా కన్నడ భాషలోనే నామఫలకాలను వేసేలా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
ఆయకట్టులో రెండో
పంటకు నీరివ్వండి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో రెండో పంటకు నీరందించాలని ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి, రైతు సంఘం గౌరవాధ్యక్షుడు చామరస మాలి పాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం మంత్రాలయంలోని పద్మనాభ అతిథిగృహంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్తో చర్చించారు. రబీ పంటకు నీరు అందించడానికి డీసీఎం అంగీకరించారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల అమరికకు రెండు రాష్ట్రాల మంత్రులతో చర్చిస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం అందించాలని విన్నవించినట్లు తెలిపారు.
పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరూ
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం దేవదుర్గ తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మల్లేష్ నాయక్ మాట్లాడారు. కల్యాణ కర్ణాటకలోని కొప్పళ, బళ్లారి, రాయచూరు, యాదగిరి, కలబుర్గి, బీదర్, విజయ నగర జిల్లాల్లో వరదల వల్ల నష్ట పోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు. వాణిజ్య పంటలకు మద్దతు ధర ప్రకటించి వారిని ఆదుకోవాలన్నారు. మొక్కజొన్నలకు క్వింటాల్కు రూ.4500 మద్దతు ధర కేటాయించి 35 క్వింటాళ్లను కొనుగోలు చేయాలని, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటాల్కు రూ.9100 మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
టీబీ డ్యాంకు పెరిగిన వరద
హొసపేటె: తుంగభద్ర జలాశయానికి తిరిగి వరద కొనసాగుతుండటంతో ఏ క్షణమైనా నదికి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. గత మూడు రోజుల నుంచి డ్యాంకు ఎగువన పరివాహక ప్రాంతాల్లో వర్షాలు ఊపందుకోవడంతో డ్యాంకు వస్తున్న వరద భారీగా పెరిగింది. గురువారం డ్యాంకు 21 వేల క్యూసెక్కుల వరకు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం వర్షం కురుస్తుండటం కొనసాగుతుండటంతో భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని, ఏ సమయంలోనైనా దిగువకు భారీగా వరద నీరు విడుదల చేసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేశారు.
పంటలకు మద్దతు
ధర ప్రకటించండి
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాలని జన సేవ ఫౌండేషన్ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జావిద్ ఖాన్ మాట్లాడారు. రాయచూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం, వాణిజ్య పంటలకు మద్దతు ధర ప్రకటించి రైతులు ఆదుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
కన్నడలో నామఫలకాలు ఏర్పాటు చేయాలి
కన్నడలో నామఫలకాలు ఏర్పాటు చేయాలి
కన్నడలో నామఫలకాలు ఏర్పాటు చేయాలి
కన్నడలో నామఫలకాలు ఏర్పాటు చేయాలి


