
కృష్ణమ్మ ఉగ్రరూపం.. వరదలు ఉధృతం
రాయచూరు రూరల్: మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు కర్ణాటకలోకి పోటెత్తుతోంది. వేదగంగా, పంచగంగా, దూద్ గంగా, హిరణ్య కేశి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, భాగల్ కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాద గిరి, రాయచూరు జిల్లాలు వరద ప్రభావానికి గురవుతున్నాయి. అనేక ప్రాంతాలు జలమయమై జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. బెళగావి జిల్లాబెణ్ణే తుప్రి వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. 14 వంతెనలు నీటమునిగాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలమట్టి జలాశయానికి లక్షా35వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో జలాశయం గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ నారాయణ పుర డ్యాంకు విడుదల చేస్తున్నారు.నారాయణపుర డ్యాం 30 గేట్లను ఎత్తి లక్షా10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రజలు నది తీరాలకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు
వరద నీటి ప్రవాహంతో పలు గ్రామాలకు ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లింగసూగురు తాలూకాలోని మాదరదొడ్డి, కడదరగడ్డ, ఓంకార గడ్డి, యరగూడి, హంచినాళ, మల్లమ్మ గడ్డ, జలదుర్గ, రాయచూరు తాలూకా అత్కూరు, కురువకుర్ద, కురవకుల, దొంగ రాంపూర. కాడ్లూరు, గురాజపూర్, గంజల్లి, దేవదుర్గ తాలూకా వీరగోట, ముదగోట, లింగదహల్లి, చిచోడి, బాగురు, అంచేసూగురు, గోపాల పుర, కర్క హల్లి, హేరుండి, అప్రాళ, బసవంతపుర, చిక్కరాయకుంపి, హిరే రాయకుంపి, గూగల్ తదితర ప్రాంతాలు జలావృతం అయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు.
వరద నీటిలో చిక్కుకుపోయిన కాపరులు
కరకల గుడ్డకు చెందిన గొర్రెల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారు ఉన్న ప్రాంతాన్ని వరదనీరు చుట్టుముట్టింది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు బాధితులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఘటన స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలివెళ్లాయి.

కృష్ణమ్మ ఉగ్రరూపం.. వరదలు ఉధృతం