
పాలికె షాపింగ్ కాంప్లెక్స్ కూల్చకూడదు
సాక్షి,బళ్లారి: మహానగర పాలికె ఆదేశాలు, ప్రభుత్వం నుంచి నోటీసులు లేకుండా పాలికెకు చెందిన వాణిజ్య కాంప్లెక్స్లో వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవించే వారిని ఖాళీ చేయించి కాంప్లెక్స్ కూల్చివేతకు కుట్ర పన్నుతున్నారని, కొందరు కాంగ్రెస్ గూండాలు రాత్రివేళలో వచ్చి షట్టర్లను పీకేసి, వ్యాపారులకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం నగరంలోని రాయల్ సర్కిల్ సమీపంలోని నటరాజ్ థియేటర్ ఎదురుగా మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ధర్నా, ఆందోళన చేపట్టారు. నటరాజ్ టాకీస్ ఎదురుగా 40కి పైగా ఉన్న స్టాల్స్లో చిన్న చిన్న వ్యాపారాలు, అంగళ్లు, హోటళ్లు పెట్టుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు జీవిస్తున్నారన్నారు. ఉన్నఫళంగా కాంప్లెక్స్లో జీవిస్తున్న వారిని ఖాళీ చేయించి కూల్చివేతకు కుట్ర పన్నారని నేతలు మండిపడ్డారు.
నోటీసులు ఇవ్వకుండా షట్టర్ల తొలగింపా?
దాదాపు 40 ఏళ్లకు పైగా పాలికెకు బాడుగలు చెల్లించి, వారి వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. అయితే వారిని ఖాళీ చేయించాలనే ఉద్దేశ్యంతో కొందరు కాంగ్రెస్ గూండాలు రాత్రిళ్లు షట్టర్లను తీసుకెళ్లారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో బయట పడాలన్నారు. పాలికె నుంచి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు ఖాళీ చేయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా రాలేదని, దీంతో బాధితులు తమ వద్ద గోడు వినిపించడంతో తాము ఆందోళన చేస్తున్నామన్నారు. బాధితుల తరఫున పోరాటం చేస్తామని, ఎట్టి పరస్థితుల్లోను పాలికె నుంచి లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. వందలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోతారన్నారు. ఒకరిద్దరి లాభం కోసం పేదల పొట్టకొట్టడం సరి కాదని అన్నారు.
మాకు జీవనోపాధి పోతుంది: బాధితులు
కాంప్లెక్స్లో బాడుగకు ఉంటూ వ్యాపారం చేసే వారు మాట్లాడుతూ తాము ఉగ్గాని, మిర్చి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నామన్నారు. ఈ కాంప్లెక్స్ నుంచి ఖాళీ చేయిస్తే తమకు జీవనోపాధి ఉండదని, నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేయించాలని కొందరు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుల అంగళ్లు, హోటల్, సెల్ఫోన్ల దుకాణ వ్యాపారులు, వివిధ రకాల అంగళ్లు పెట్టుకుని జీవించే వారందరూ కూడా ముక్తకంఠంతో కాంప్లెక్స్ భనవం కూల్చివేయడం తగదన్నారు. తమకు నోటీసులు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు. నటరాజ్ థియేటర్ ముందు ఉన్న కాంప్లెక్స్ భనవం కూల్చివేత చేపడతారనే విషయం తెలియగానే నగరంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి బాధితులకు అండగా నిలిచారు. మాజీ మేయర్, పాలికె ప్రతిపక్ష నేత ఇబ్రహీంబాబు, కార్పొరేటర్లు కోనంకి తిలక్, మోత్కూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి ఆదేశాలు లేకుండా
కూల్చితే పేదలకు అన్యాయం
మొండిగా కూల్చివేతకు దిగితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం
మాజీ మంత్రి శ్రీరాములు,
మాజీ ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి