
పెళ్లి చేసుకోకుంటే ఫొటోలు వైరల్ చేస్తా ●
● యువతికి వివాహితుని బెదిరింపులు
హుబ్లీ: ఓ యువతిని తనను పెళ్లి చేసుకోకుంటే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను, అలాగే వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ ఓ వివాహితుడు బెదిరించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాలు.. బీదర్కు చెందిన లోకేష్పై బాధిత యువతి ఫిర్యాదు చేసింది. 2023లో పరిచయమైన వీరిద్దరి మధ్య స్నేహం కుదిరి ప్రేమ అంకురించింది. ఆ సమయంలో పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. అయితే సదరు వ్యక్తి పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత అతడికి పెళ్లి అయినట్లు తెలుసుకుని, ఈ విషయాన్ని నిలదీయగా, ఏమైనా కాని నిన్ను కూడా పెళ్లి చేసుకుంటానని, లేకుంటే నీతో ఉన్న ఫోటోలు బహిరంగ పరుస్తానని, అలాగే రూ.50 లక్షలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
చికిత్స పొందుతూ
వృద్ధుని మృతి
హుబ్లీ: మంటూరు బండివాడ క్రాస్ వద్ద గూడ్స్ వాహనం డోర్ తగిలిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స ఫలించక స్థానిక కేఎంసీ ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. ఈయన నడుచుకుంటూ రోడ్డుపై వెళుతుండగా, సదరు గూడ్స్ వాహనం డోర్ ఉన్నఫళంగా ఖాజాసాబ్ హుస్సేన్సాబ్(63)కు తగలడంతో గాయపడ్డాడు. ఆయనను ఆస్పత్రికి తరలించగా, సదరు వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
21న యోగా డే
ఘనంగా జరపండి
బళ్లారిటౌన్: నగరంలో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరపాలని జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా అధికారులకు సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో జరిగిన ముందస్తు సమీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమ నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. శెట్రు గురుశాంతప్ప పీయూ కళాశాల మైదానంలో యోగా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం వర్షాకాలం అయినందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆరోజు ఉదయం 7 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. ఈసందర్భంగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిధుల దుర్వినియోగంపై
పీడీఓ సస్పెండ్
రాయచూరు రూరల్: పంచాయతీ నిధులను దుర్వినియోగ పరిచిన గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి(పీడీఓ)ని సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే ఆదేశాలు జారీ చేశారు. లింగసూగూరు తాలూకా కోఠా పంచాయతీలో విధి నిర్వహణలో లోపం, రూ.26 లక్షల నిధుల వినియోగంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రుజువు కావడంతో పీడీఓ గంగమ్మను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
మఠాలు ఏకం కావాలి ●
● రాజీ ప్రక్రియతో సమస్యను
పరిష్కరించుకోవాలి
● మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు
రాయచూరు రూరల్: మంత్రాలయం మఠం, ఉత్తరాది మఠం రాజీ కావాలని తమిళనాడు హైకోర్టు ఆదేశించిందని మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ తెలిపారు. ఆయన గురువారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో సమాజం కోసం రెండు మఠాలు ఏకం కావాలన్నారు. రెండు మఠాల మధ్య ఉన్న తేడాను గురించి సామరస్యంగా, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులు ఆదేశించారన్నారు.

పెళ్లి చేసుకోకుంటే ఫొటోలు వైరల్ చేస్తా ●