
పసిమొగ్గలపై పైశాచికం
సాక్షి, బెంగళూరు: అభంశుభం తెలియని చిన్నారి బాలికల మీద కామాంధులు కన్నేస్తారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వేధిస్తారు. వారూ వీరని ఇందుకు తేడా లేదు. ఇలా బాలికలకు భద్రత కరువవుతోంది. రాష్ట్రంలో పోక్సో కేసులు ఏటేటా పెరగడమే దీనికి నిదర్శనం. ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు ప్రతి రోజూ సగటున పది కేసులు నమోదయ్యాయి. లైంగికపరమైన నేరాల నుంచి పిల్లల రక్షించేందుకు, కామాంధులకు కఠిన శిక్షలు పడేందుకు గతంలో కేంద్రం పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ కామాంధులకు అడ్డుకట్ట పడుతోందా అన్నదే ప్రశ్న. 2021 నుంచి ఈ ఏప్రిల్ వరకు సుమారు 15,409 కేసులు కర్ణాటకలో నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది. 2021లో 2,882 కేసులు వచ్చాయి. ఈ నాలుగేళ్లలో ఆ సంఖ్య 38.89 శాతం మేర పెరగడం గమనార్హం. కేసులు పెద్దసంఖ్యలో ఉంటే, శిక్షలు మాత్రం తక్కువగా ఉండడం నిందితులకు కలిసి వస్తోంది.
బెంగళూరులో ఏదీ భద్రత?
2024 నుంచి 2025 ఏప్రిల్ వరకు బెంగళూరులో అత్యధికంగా 1,386 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత మైసూరు 442, చిక్కబళ్లాపురలో 410, తుమకూరులో 362, శివమొగ్గలో 456, బెళగావిలో 335, మండ్యలో 311, హాసన్లో 322 కేసులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య 100కు సమీపంలో ఉంది. దక్షిణ కర్ణాటక జిల్లాల్లో 150కి పైగా కేసులు నమోదు అవుతున్నట్లు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి.
శిక్షలు మాత్రం స్వల్పమే
ఏటా కేసుల పెరుగుదల బాలికల భద్రతను సందేహాస్పదం చేస్తోంది. చిన్నారి బాలలపై కామాంధుల వేధింపుల పెరుగుదలకు ఇది అద్దం పడుతోంది. శిక్షలు మాత్రం ఆశించిన మేర ఖరారు కావడం లేదు. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో 7,954 కేసుల్లో 130ల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. అబద్ధపు కేసులు, ఇంకా పోలీసుల విచారణలో అలసత్వం, సాక్ష్యాల కొరత, చార్జ్షీట్లో లోపాల కారణంగా సుమారు 1,682 కేసుల్లో నిందితులు బయటకు వచ్చారు. మిగిలిన కేసులు న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉన్నాయి.
తెలిసివారే కీచకులు
ప్రేమ పేరుతో బాలికలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. నిందితుల్లో ఎక్కువగా ఇరుగుపొరుగు వారు, పరిచయస్తులే ఉంటున్నారని పోలీసులు తెలిపారు. 100 కేసుల్లో సుమారు 80 శాతం కేసులు ఇదే తరహాలో ఉంటున్నాయని చెబుతున్నారు. కొన్ని కేసుల్లో నిందితులు పలుకుబడి ఉన్నవారు కావడం మూలాన బాధితులు పోరాడలేకపోతున్నారు. దీనివల్ల కూడా కేసులు తేలికగా వీగిపోతున్నాయి. అనేక వేధింపుల సంఘటనల్లో బాలికల తల్లిదండ్రులు భయపడి ఫిర్యాదు కూడా చేయరు.
రక్షణ లేని చిన్నారి బాలలు
రాష్ట్రంలో రోజుకు పది పోక్సో కేసులు
నాలుగేళ్లలో 15,409 ఘటనల నమోదు

పసిమొగ్గలపై పైశాచికం

పసిమొగ్గలపై పైశాచికం

పసిమొగ్గలపై పైశాచికం