రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలకు వివరించాలని లోక్సభ సభ్యుడు కుమార నాయక్ పేర్కొన్నారు. గురువారం నగర బస్టాండ్లో ఏర్పాటు చేసిన రెండేళ్ల పాలన సాధనలపై చిత్ర ప్రదర్శనను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏడు కోట్ల మంది జీవితాలను మెరుగు పరచడానికి పంచ గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. రెండేళ్లలో వ్యవసాయం, ఆరోగ్యం, మౌలిక సౌకర్యాలు, వసతి, అన్నదాతల్లో మందహాసం వంటి అంశాలపై సమాచారాన్ని ప్రజలకు తెలియ చేయడం కోసం ప్రచారం చేపట్టాలన్నారు. ఏపీఎంసీ అధ్యక్షుడు జయంతరావ్ పతంగి, ఆర్టీసీ అధికారి చంద్రశేఖర్, వార్త శాఖాధికారులు గవి సిద్దప్ప హొసమని, ప్రకాష్, లింగరాజ్, రమేష్, వెంకటేష్లున్నారు.
రచయితలకు
అవార్డుల ప్రదానం
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవారలో రచయితలకు చుక్కి ప్రతిష్టాన అవార్డులు అందజేశారు. ఉమాపతి చుక్కి 49వ పుణ్యారాధన సందర్భంగా రచయితలు శాశ్వతయ్య స్వామి ముక్కుంద మఠ, సర్వమంగళ సక్రి, బాబు భండారిగల్లకు అవార్డులు అందించారు. కార్యక్రమంలో బెళగావి నగనూరు గురు బసవ మఠాధిపతి బసవ గీతా, నవల్కల్ అభినవ సోమనాథ శివాచార్య స్వామీజీ, చుక్కి ప్రతిష్టాన అధ్యక్షులు శివానంద, సభ్యులు శివకుమార్, మల్లికార్జున, పరమేశ్వర సాలిమట్, గిరిజా శంకర్లున్నారు.
కక్ష సాధింపుతోనే
ఈడీ దాడులు
సాక్షి,బళ్లారి: నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఇల్లు, లోక్సభ సభ్యుడు తుకారాం, ఎమ్మెల్యేలు గణేష్, శ్రీనివాస్, నాగేంద్ర ఆప్తసహాయకుడు గోవర్దనరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ సోదాలు చేయడం ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపుతోనే జరిగాయని, వీరందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో బీజేపీ పెద్దలు తమ ప్రజాప్రతినిధులను ఈడీతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్ పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ సర్కారు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలపైనే టార్గెట్ చేసి దాడులు చేయించిందన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను వాడుకుని తమ నేతలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈసందర్భంగా మేయర్ నందీష్, డీసీసీ అధ్యక్షులు అల్లం ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అధిక ఫీజుల వసూలు తగదు
రాయచూరు రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26వ విద్యా సంవత్సరంలో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని దళిత విద్యార్థి పరిషత్ జిల్లా సంచాలకుడు మౌనేష్ పేర్కొన్నారు. గురువారం పాత్రికేయల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యా శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ఖండించారు. అధిక ఫీజులు వసూలు చేయరాదంటూ అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి రితీక్ కుమార్, కమిషనర్ కావేరిలకు లేఖలు రాసినట్లు తెలిపారు.
బాలికపై లైంగిక దాడి
హోసూరు: ఇంటి ముందు ఆటలాడుకొంటున్న బాలికను నిర్మానుష్య స్థలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన కామాంధున్ని సింగారపేట పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిష్ణగిరి జిల్లా సింగారపేట తీర్థగిరి ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆటలాడుకొంటున్న బాలికను సింగారపేటకు చెందిన శరవణ్ చాక్లెట్ ఇస్తానని తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకొని తల్లిదండ్రులతో మొరపెట్టుకొంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సింగారపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని అరెస్ట్ చేశారు.
సర్కారు రెండేళ్ల పాలనపై ప్రజలకు వివరించాలి
సర్కారు రెండేళ్ల పాలనపై ప్రజలకు వివరించాలి
సర్కారు రెండేళ్ల పాలనపై ప్రజలకు వివరించాలి