
కన్నుల పండువగా కారుపౌర్ణమి
బళ్లారిటౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో సంస్కృతీ వారసత్వాలకు ప్రతీకగా నిర్వహించే కారు పౌర్ణమి వేడుకలను బుధవారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించారు. ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా గ్రామంలో వైభవంగా కారుపౌర్ణమి వేడుకలను నిర్వహించేవారు. గ్రామంలో రెండు వర్గాల మధ్య గతంలో ఘర్షణలు జరగడంతో ఏడాదిగా నిలిచిపోయిన వేడుకలను జిల్లా పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో గ్రామంలో శాంతిసభలు నిర్వహించి, భారీ పోలీసు బందోబస్తు మధ్య ఘనంగా జరిపారు. దాదాపు 250 మంది పోలీసులు, ఉన్నతాధికారులు పాల్గొని గ్రామంలో పోలీసు పరేడ్ చేశారు. ఈ క్రమంలో జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఈ వేడుకలను చూసి తరించారు. ఈసారి అందరి సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహించడంతో గ్రామస్తుల్లో సంతోషం నెలకొంది.
సప్త భజనలు, సంప్రదాయబద్ధంగా పూజలు
ఏరువాక పౌర్ణమి సందర్భంగా వారం రోజులుగా లక్ష్మీ నరసింహ ఆలయం వద్ద సప్తభజనలను నిర్వహించారు. ప్రతి రోజు ఒక వర్గానికి చెందిన వారు భజనల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగింపు రోజు పౌర్ణమి రాత్రి 21 ఎద్దులతో శివరామ అవధూత చిత్ర పటాన్ని ఊరేగిస్తారు. ఊరేగింపులో భజన, కోలాట, తోలుబొమ్మలాట బృందాలు, అనేక సాంస్కృతిక నృత్యాలు చేపడుతారు. ఈసారి ఎలాంటి లోటు లేకుండా ఈ పండుగను నిర్వహించారు. ఇందులో తొలి వరుసలో కట్టిన ఎద్దుకు ప్రాధాన్యత కల్పించి, ఒక వర్గానికి చెందిన ఎద్దును ముందు కట్టేందుకు నిర్వహించడం సంప్రదాయంగా చేశారు. అదే విధంగా పౌర్ణమి రోజున ఊరువాకిలి వద్ద ఎద్దుల పరుగు పందేలు నిర్వహించి గెలుపొందిన ఎద్దును పౌర్ణమి రోజు ఊరేగించారు. ప్రధాన వీధుల్లో గెలుపొందిన ఎద్దును ఊరేగించడం అందరినీ ఆకట్టుకుంది.
ఏడాదిగా నిలిచిన వేడుకలు
పోలీసు భద్రత మధ్య పండుగ
శోభాయమానంగా ఊరేగింపు

కన్నుల పండువగా కారుపౌర్ణమి

కన్నుల పండువగా కారుపౌర్ణమి