
ఎడతెగని వానలు.. కష్టాల్లో ప్రజలు
హుబ్లీ: ధార్వాడ జిల్లాలో ఎడతెగని వానలతో జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బుధవారం రాత్రి జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. దీంతో రాత్రి 9 గంటల నుంచే హుబ్లీ హొసూరు నుంచి ఉణకల్లు చెరువు వరకు మోకాలి లోతున నీటి ప్రవాహంతో రాకపోకలు స్తంభించి పోయాయి. ముఖ్యంగా వాహనదారులతో పాటు ఆ ప్రాంతంలోని భూగర్భ దుకాణాల యజమానులు పడరాని పాట్లు పడ్డారు. నవలగుంద తాలూకా యమనూరు గ్రామ శివారులో ఓ తోట ఇంట్లో కుటుంబ సభ్యులు జల సంద్రంలో చిక్కుకున్నారు. బెణ్ణిహళ్ల వాగుకు వరద పోటెత్తడంతో ఇద్దరు పిల్లలు గల ఆ దంపతులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఎట్టకేలకు క్షేమంగా బయట పడ్డారు. బెణ్ణిహళ్ల నీరు హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి గ్రామంలోకి వరదలా వచ్చింది. ఫలితంగా ఆ గ్రామానికి రోడ్డు సంధానం పూర్తిగా జలమయమైంది. పొలాల్లో వరద నీరు నిండిపోయింది. యమనూరు గ్రామంలో కూడా వరద నీటితో అక్కడి నివాసులు ఎన్నో ఇక్కట్లు పడ్డారు.
పోటెత్తిన బెణ్ణిహళ్ల వాగు
బెణ్ణిహళ్ల వాగు పరిధిలో వరద నీరు ఉన్నఫళంగా పెరిగిపోయింది. ధార్వాడ గ్రామీణతో పాటు హుబ్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వానలు పడటంతో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు అన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. ధార్వాడ కసబాపేటె పోలీస్టేషన్ పరిధిలోని బెళగలి రోడ్డు పక్కన డ్రైనేజీ నీటిలో ఓ వ్యక్తి అదుపు తప్పి కొట్టుకుపోయాడు. అలాగే హుబ్లీ నేకార నగర్ ప్రాంతంలో కూడా బైక్ మీద వెళ్తున్న వ్యక్తి వరద నీటిలో పడి గల్లంతయ్యాడు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. ఉణకల్లు చెరువు నీటితో నిండిపోయింది. దీంతో చెరువు చుట్టుపక్కల వరద నీరు పోటెత్తింది. దీంతో అక్కడి నివాసులు నరకయాతన పడ్డారు. రెడ్ అలర్ట్ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచే నిరంతరంగా వాహనాలతో అప్రమత్తత ప్రకటించారు. భద్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని అంగన్వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, పీయూసీ, డిగ్రీ కళాశాలలకు గురువారం సెలవును ప్రకటిస్తూ జిల్లాధికారిణి దివ్యప్రభు ఆదేశాలిచ్చారు.
భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం
రాయచూరు రూరల్: జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసిన రోడ్లు బురదగుంటలుగా మారాయి. మూడు గంటల పాటు కురిసిన వానలకు మస్కి వద్ద చిక్క ఉద్బాళ వంతెనపై ట్రాక్టర్ ప్రయాణిస్తుండగా వరద ఉధృతి పెరిగింది. మాన్వి సమీపంలో వంతెనలో ఆర్టీసీ బస్సు దిగబడింది. రాయచూరు నుంచి దూర ప్రాంతా లకు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. మూడు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి.
జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం
నిండిపోయిన ఉణకల్లు చెరువు

ఎడతెగని వానలు.. కష్టాల్లో ప్రజలు

ఎడతెగని వానలు.. కష్టాల్లో ప్రజలు

ఎడతెగని వానలు.. కష్టాల్లో ప్రజలు